ఖలీల్వాడి, డిసెంబర్ 20: కరోనాపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పీహెచ్సీల్లో అవసరమైన సదుపాయాలను కల్పించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్యసేవలందించాలని సూచించారు.
పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మెడికల్ షాపుల్లో సరైన ధరలకు మందులను విక్రయించేలా సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని, దుకాణాల లైసెన్సులను తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో సీఈవో గోవింద్, జడ్పీటీసీలు గంగాధర్, సుమనారెడ్డి, డీఈవో దుర్గాప్రసాద్, రామ్మోహన్ పాల్గొన్నారు.