ప్రాచీన కోటలు, అపురూప సౌందర్యం ఉట్టిపడే శిల్పకళాకృతులు, సహజ సిద్ధమైన గుహలు, ఆలయాలు.. చరిత్రకు ఆనవాళ్లు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్కోట చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచింది. 400 ఏండ్ల క్రితం 400 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయులు అద్భుత కట్టడంగా నిర్మించారు. ఈ కోటను ఒకసారి సందర్శిస్తే మళ్లీమళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది. కోటలో నిర్మించిన రాతి కట్టడాలను చూసి మైమరిచిపోవాల్సిందే.
అద్బుతమైన కట్టడాలు…
400 ఎకరాల స్థలంలో మొత్తం రాతి కట్టడంతో నిర్మించిన కోట. కోట చుట్టూ ప్రహరీ. అందులో వేంకటేశ్వర ఆలయం, మసీదు, ఏనుగులు ఈదే బావి, అష్టభుజ ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఇప్పటికీ నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది అడుగుల ఫిరంగి సైతం కోటలో నేటికీ దర్శనమిస్తున్నది. అప్పట్లో మహారాజు ఆశీనులైన సమావేశపు హాల్, రాణిమహల్, ఈత కొలనులు, కౌలాస్ కోట నుంచి కర్ణాటకలోని బీదర్కు సొరంగ మార్గం సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయి. కోట పక్కనే వాగు నిర్మించారు. కోటను తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సెలవు దినాల్లో పర్యాటలకు సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఎల్లమ్మ ఆలయం వద్ద అప్పట్లో కాకతీయులు నిర్మించిన కొలనులో భక్తులు స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.