బాన్సువాడ, జూన్ 1 : బాన్సువాడ ఏరియా దవాఖానకు మరో అరుదైన గౌరవం దక్కింది. బాన్సువాడ ఏరియా దవాఖాన, వంద పడకల మాతాశిశు వైద్యశాలలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తుండడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు వరిస్తున్నాయి. 2018 నుంచి వరుసగా ఐదు సార్లు కాయకల్ప అవార్డు దక్కించుకుని రికార్డు సాధించింది. 2023 సంవత్సరానికి గాను బాన్సువాడ ఏరియా దవాఖానను ఉత్తమ దవాఖానగా ప్రభుత్వం ప్రకటించింది. బాన్సువాడ వైద్యశాల కాయకల్ప అవార్డులో రెండోస్థానంలో నిలిచింది. కాయకల్ప అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదును ప్రభుత్వం ప్రకటించింది.
అవార్డు ఎంపిక ఇలా..
జాతీయ నాణ్యతా ప్రమాణాల ఆధారంగా, రోగులకు అందుతున్న సేవలకు గాను 2023 ఏడాదికి గాను బాన్సువాడ ఏరియా వైద్యశాలకు కాయకల్ప అవార్డు వరించింది. వైద్య సేవలు, సుందరీకరణ, పరిశుభ్రత, అనుబంధ సేవలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, రోగ వ్యాప్తి నివారణ, పరిశుభ్రత ప్ర మాణాలు, దవాఖాన ఆవరణ, వెలుపల అందుతున్న సేవలు, ఏకో ఫ్రెండ్లీ తదితర విభాగాలపై రాష్ట్రస్థాయి వైద్య బృందం ఆధ్యయనం చేసింది. పలు విభాగాల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి మార్కులు వేశారు. రాష్ట్రంలోనే నాణ్యతా ప్రమాణాలు కలిగిన దవాఖానగా బాన్సువాడ వైద్యశాల రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాయకల్ప అవార్డులో భాగంగా 2017-18లో మొదటి స్థానం, 2018-19లో ద్వితీయ స్థానం, 2020-21లో మొదటి స్థానం, 2021-22లో బాన్సువాడ దవాఖాన ఏకో ఫ్రెండ్లీ లో మొదటి స్థానం సాధించింది. 2022-23లో కాయకల్ప అవార్డులో ద్వితీయ స్థానంలో నిలిచి వరుసగా ఐదు సార్లు అవార్డులు సాధించిన దవాఖానగా చరిత్ర సృష్టించింది. అవార్డుకు ఎంపిక కావడంతో పాటు రూ.10 లక్షల నగదును ప్రభు త్వం ప్రకటించింది.
జాతీయ స్థాయి అవార్డులూ సొంతం..
బాన్సువాడ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో తల్లి పాలు పట్టే విధానం, తల్లిపాల ప్రాముఖ్యత, బాలింతలకు అందిస్తున్న సేవలపై బేబీ ఫ్రెండ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్ వర్క్ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది.భారతదేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ దవాఖానగా మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి ఫిబ్రవరి 17, 2023 న బ్రెస్ట్ ఫీడింగ్ దవాఖానగా అక్రిడిషేన్ అందించింది. 2019, 2022లో మాతృత్వ సేవల విశిష్ట పురస్కారం అ యిన జాతీయ స్థాయి లక్ష్య అవార్డును సాధించిం ది. అంతేకాకుండా దవాఖానలోని ఎయిడ్స్ కం ట్రోల్ కేంద్రానికి 2023లో ఫైవ్స్టార్ అక్రిడియేషన్ లభించింది. 2020, 2021, 2022 లో వరుసగా మూడు సార్లు (ఎన్క్యూఎస్) జాతీయ స్థాయి అక్రిడియేషన్ను బాన్సువాడ దవాఖాన సాధించింది.
అవార్డు రాకతో బాధ్యత మరింత పెరిగింది…
జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకారం రోగులకు అందిస్తున్న సేవలకు గాను 2023లో రాష్ట్రస్థాయిలో బాన్సువాడ దవాఖానకు కాయకల్ప అవార్డు రెండవ స్థానం రావడం సంతోషంగా ఉంది. అవార్డు రాకతో మాపై బాధ్యత మరింత పెరిగింది. దవాఖాన నిర్వహణలో రాష్ట్ర శాసనభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిది. అన్ని విభాగాల సిబ్బంది సహకారంతోనే ఈ అవార్డును సాధించాం. రోగులకు మరింత నాణ్యమై వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
-డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా దవాఖాన