బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 6: కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంపై నిందలు మానుకొని, ఎన్నికల్లో వారిచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు గడిచాయని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి తప్ప మిగతావి నెరవేర్చలేదని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. నమ్మి ఓటేసి అధికారమిస్తే.. హామీలను తుంగలో తొక్కి ప్రజలకు మొండిచేయి చూపించారని విమర్శించారు. కౌలు రైతులకు రూ.15వేలు, రూ.2లక్షల రుణమాఫీ ఇప్పటి వరకూ చేయలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు.
డబ్బులిచ్చి పదవులు పొందే రకం కాదు..
సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడించి తరిమేస్తే ఇక్కడికి వచ్చిన వలసపక్షి.. తాను చేసిన అభివృద్ధిని ఎత్తిచూపడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసి 80శాతం ఇండ్లు పూర్తిచేశామన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొలివిడుతగా ఇచ్చిన 1600 డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తిచేయలేని చేతకాని నాయకుడివని విమర్శించారు. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లు లేవో చూపించాలని సవాల్ విసిరారు. తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పదవి పోవడానికి ఆ కాంగ్రెస్ నాయకుడే ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపించారు. డీసీసీబీ డైరెక్టర్లకు డబ్బుల ఆశచూపి, గోవా ట్రిప్పులకు పంపించి ద్రోహమైన క్యాంపు రాజకీయాలు చేశాడన్నారు. నీ కన్నా ఎక్కువ డబ్బులిస్తే తన కుమారుడు రాజీనామా చేసేవాడు కాదని, తాము డబ్బులిచ్చి పదవులు పొందే రకం కాదన్నారు. పదవులపై ఆశ లేదని, ప్రజల పక్షాన నిలబడి సేవ చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఆస్తులు, వ్యాపారాలను కాపాడుకునేందుకు అవకాశవాదులు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. కొందరిని తన కొడుకుల కన్నా ఎక్కువ నమ్మి చేరదీశానని, అండగా ఉండాల్సిన వారు మోసం చేశారని, అలాంటి వారికి పుట్టగతులుండవని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆలిండియా బంజారా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.