కోటగిరి, డిసెంబర్ 4 : ప్రభుత్వ పాఠశాలల్లో పారదర్శకత పెంచేందుకు విద్యాశాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హాజరు శాతం పెంచడంతో పాటు పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా విద్యార్థుల హాజరును పక్కాగా నమోదు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల హాజరును పక్కాగా నమోదు చేసే ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. ఇక నుంచి విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదుకు యాప్ను తయారు చేసింది. దీంతో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్సీ ద్వారా ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారు. ఎఫ్ఆర్సీ అమలు కోసం విద్యార్థుల డేటాను సేకరించింది. దీంతో విద్యార్థుల హాజరు పక్కాగా నమోదవుతున్నది.
సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల హాజరును పక్కాగా నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రిజిస్టర్లో అటెండెన్స్కు బదులు ఇక నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థుల ఫొటో తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తే.. ఏ రోజు ఎంతమంది విద్యార్థులు హాజరు, గైర్హాజరయ్యారనే వివరాలను జిల్లా అధికారులతోపాటు రాష్ట్రస్థాయి అధికారులు ఆన్లైన్ ద్వారా తెలుసుకునే వీలున్నది. ఎక్కువ రోజులు పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి సక్రమంగా బడికి వచ్చేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
పక్కాగా పర్యవేక్షణ..
జిల్లాలో 255 జడ్పీహెచ్ఎస్, 1196 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 మోడల్ స్కూల్, 25 కేజీబీవీలు, 3 తెలంగాణ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, మొత్తం 1,05,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల హాజరును పక్కాగా సేకరించేందుకు విద్యాశాఖ ఓ యాప్ను ప్రవేశపెట్టింది. ఇందులో విద్యార్థి ఫొటో, వివరాలను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. పేరు, తండ్రి, గ్రామం, ఊరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంపై అవగాహన కోసం ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులకు శిక్షణను కూడా ఇచ్చారు. ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్తో సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. విద్యార్థుల హాజరు ప్రకారం మధ్యాహ్న భోజనం ఎంత మందికి సిద్ధం చేయాలి, పౌష్టికాహారం పక్కాగా అందుతుందా? లేదా .. అనేది తెలుసుకోవచ్చు. ఈ విధానంలో మంచి ఫలితాలు వస్తే దీనిని ఉపాధ్యాయులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిసింది. మారుమూల, గిరిజన తండా స్కూళ్లలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా హాజరు వేసుకుంటున్నారని, కొంతమంది తమకున్న పలుకుబడితో మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం అం దుబాటులోకి వస్తే ఇలాంటి వాటికి చెక్ పె ట్టొచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
నిర్లక్ష్యం చేయొద్దు..
విద్యార్థుల హాజరును పక్కాగా నమోదు చేసేందుకు వారి వివరాలను యాప్లో నిక్షిప్తంగా చేశాం. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్లో పారదర్శకత పెరుగుతుంది. ముఖ గుర్తింపు హాజరు నమోదు అమలులో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు.
– దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్
ఏకకాలంలో 20మంది హాజరు నమోదు
విద్యాశాఖ రూపొందించిన నూతన యాప్లో క్లాస్ టీచర్ లేదా హెచ్ఎం తన స్మార్ట్ ఫోన్లో యాప్ను ఓపెన్ చేసి తరగతిలో విద్యార్థుల వైపు చూపితే ఒకేసారి 20మంది హాజరును నమోదు చేసుకుంటుంది. ఈ యాప్ ద్వారా ఒకసారి విద్యార్థుల ఫొటోలను నమోదు చేసుకుంటే ఒకటి నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఉన్నతాధికారులు కూర్చున్న చోటే సంబంధిత పాఠశాలకు చెందిన వివరాలు, విద్యార్థుల హాజరు తెలుసుకోవాలంటే యాప్లోకి వెళ్తే సరిపోతుంది. ఈ యాప్ అమలుతో విద్యాశాఖ వద్ద విద్యార్థుల సంఖ్య పక్కాగా నమోదై ఉంటుంది. దీంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని పంపిణీ చేసేందుకు అనువుగా ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ యాప్లోనే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష ఫలితాలు నమోదు చేయాల్సి ఉండడంతో విద్యార్థుల ప్రగతి నివేదికలు తెలుసుకోవచ్చు. ప్రతి పాఠశాలలో బోగస్ హాజరు నమోదుకు చెక్ పడుతుంది.