రుద్రూర్, మే 25: విలువ ఆధారిత వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని ఏటీఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా రైతులకు సూచించారు. రుద్రూర్ కేవీకేను శనివారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. మట్టి ప్రయోగశాలను ప్రారంభించి, వర్మి కంపోస్టు తయారీ, అంటు కట్టు మామిడి తోటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇక్కడి రైతులు ముందున్నారని రైతులు, మహిళా రైతులను అభినందించారు.
రైతులు పండించిన పంటను మార్కెట్లో విక్రయించడమే కాకుండా ఆన్లైన్లో కూడా విక్రయించేలా కృషిచేయాలన్నారు. ప్రపంచంలో ఏదేశంలో కేవీకేలు రైతులకు అందుబాటులో లేవన్నారు. అనంతరం కేవీకే ద్వారా ఎస్సీ ఉప ప్రణాళికలో భాగ్యనగర్ టైలరింగ్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లను అందజేశారు. కార్యక్రమంలో నాబార్డ్ నిజామాబాద్ డీడీఎం ఎస్.ప్రవీణ్, బెల్లంపల్లి ప్రొగ్రాం కోఆర్డినేటర్ డా.శివకృష్ణ, రుద్రూర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.అంజయ్య, సీఎఫ్ఎస్టీ అసోసియేట్ హెడ్ డా.కల్పన, కేవీకే ఉద్యాన విభాగం శాస్త్రవేత్త డా.వెంకట రాజ్కుమార్, విస్తరణ విభాగం శాస్త్రవేత్త డా.ఎం.శ్వేత, సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డా.విజయ్కుమార్, రైతులు పాల్గొన్నారు.