ఇందూరు, సెప్టెంబర్ 13: తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు కొనసాగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు సమగ్ర ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు. 16న శాసనసభ నియోజకవర్గాల వారీగా 15 వేల మందితో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించాలని అన్నారు. ర్యాలీ, సభ అనంతరం భోజన వసతి కల్పించాలని కలెక్టర్ సూచించారు. 17న జిల్లా నుంచి సుమారు 3500 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను హైదరాబాద్కు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 18న సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీటీసీ వెంకటరమణ, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 16, 17, 18తేదీల్లో నిర్వహించనున్న వజ్రోత్సవాల్లో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోటగిరి వైస్ఎంపీపీ గంగాధర్ పటేల్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సై రాము, ఇన్చార్జి ఎంపీడీవో మారుతి, తహసీల్దార్ శ్రీకాంత్, ఏపీవో రమణ పాల్గొన్నారు.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అధికారులందరూ విజయవంతం చేయాలని ఎంపీపీ మేక శ్రీలక్ష్మి కోరారు. మండల కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 16న బాన్సువాడలో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీలో మండలంలోని వివిధ శాఖల అధికారులతోపాటు, ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. మూడు రోజులపాటు వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో బషీరుద్దీన్, ఎస్సై అనిల్రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు కరీం, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబ, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, జాస్తి శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.