విద్యానగర్,సెప్టెంబర్ 13:విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇన్స్సైర్ మనక్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 2009-10 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 2022-23 ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం జిల్లా విద్యాశాఖ ఇప్పటికే ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ నామినేషన్లు పంపే విధానంతోపాటు ఎలాంటి ప్రాజెక్టులు ఎంచుకోవాలన్న అంశంపై అవగాహన కల్పించారు. ఎంపికైన విద్యార్థి ప్రాజెక్టులను వివరిస్తూ రెండు నిమిషాల వీడియో తీయాలి.
ప్రతి పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్లు..
కామారెడ్డి జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నది. ఒక్కో పాఠశాల నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే పంపేందుకు అవకాశం ఉంటుంది. ప్రయోగానికి సంబంధించిన చిత్రాలు, వివరాలు, వీడియోలు, పాఠశాల యూడైస్ నంబర్, ఈ-మెయిల్, విద్యార్థి ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా, గైడ్ ఉపాధ్యాయుడు, హెచ్ఎం మొబైల్ నంబర్లు తదితర వివరాలను ఈ నెల 30వ తేదీలోగా వెబ్సైట్ (www. inspireawards-dst.gov.in) ద్వారా స్కూల్ అథారిటీ లాగిన్లో ఐదు ప్రాజెక్టులు నమోదు చేసుకోవాలి. మరేమైనా సందేహాలు ఉన్నవారు జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి ఫోన్ నంబర్ 9440414250 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
జిల్లాలో 78 ప్రదర్శనలు ఎంపిక..
జిల్లా వ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరంలో 78 ప్రాజెక్టులు జిల్లాస్థాయికి ఎంపికయ్యాయి. ఎంపికైన ప్రాజెక్టుల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తారు. జిల్లాలో 6 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రూ.10వేల చొప్పున తమ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రదర్శనలను రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలకు బహమతులను అందజేస్తారు. 2020-2021వ విద్యా సంవత్సరంలో 14 ప్రాజెక్ట్లు రాష్ట్ర స్థాయికి, 2021-2022లో 78 ప్రాజెక్ట్లు జిల్లాస్థాయికి ఎంపికయ్యాయి. జిల్లాస్థాయిలో ఎంపికైన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. అక్కడి నుంచి జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికైన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారంతోపాటు ఐఐటీ ప్రవేశాల్లో రిజర్వేషన్ వర్తింపచేయనున్నది.
ప్రతిభను వెలికితీసేందుకే..
విద్యార్థుల ప్రతిభను వెలికి తీసుకేందుకు ప్రతి ఏడాది ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాలతో చాలా మంది విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా ప్రయోగాల ద్వారా ప్రదర్శించడంతో వారిలో ఉన్న ప్రతిభ బయటికొస్తుంది. అంతే కాకుండా ఈ ప్రదర్శనలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పోత్సాహకంగా రూ.10వేలు ఇవ్వడంతో ఇతర విద్యార్థులకు కూడా సైన్స్ ప్రాజెక్ట్లపై మరింత ఆసక్తి ఉంటుంది. అంతే కాకుండా వెనుకబడిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఆర్థికంగా డబ్బులు లేని వారి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పారితోషికం లభిస్తుంది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణల దిశగా వారిని ప్రోత్సహించి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి చదువుతున్న 2022-23 విద్యా సంవత్సరం విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నది. ఈ నెల 30 వరకు ఇన్స్పైర్ మనక్ నామినేషన్లు అందజేసేందుకు గడువు ఉన్నది.
దరఖాస్తు చేసుకోవాలి..
ఇన్స్సైర్ మనక్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.10వేలు పారితోషికం వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
– సిద్దిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, కామారెడ్డి