శక్కర్నగర్, డిసెంబర్ 1: పర్వతారోహణే ధ్యేయంగా సుమారు ఎనిమిదేండ్లలో పలు రకాల శిక్షణ పొందుతూ, పలు పర్వతాలు అధిరోహించి, సాహసమే ఊపిరిగా .. పలువురి మన్ననలు పొందుతున్నాడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని అమ్దాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ అలీ అహ్మద్. పేద కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన అహ్మద్ 2014వ సంవత్సరం నుంచి సాహసక్రీడల్లో పాల్గొంటూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తనకు లభించిన అరుదైన అవకాశాలను వినియోగించుకొని, సాహసాలకు మారుపేరైన పలు క్రీడల్లో పాల్గొంటూ సత్తాను చాటుతున్నాడు.
హిమాలయాల్లో అత్యంత ఎతైన పర్వతగిరులు ఎక్కుతూ తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నాడు. ప్రస్తుతం హిమాలయ పర్వతాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ అహ్మద్ అలీ హిమాలయ పర్వతాల్లో లడఖ్ రీజియన్ పరిధిలోని మూడు పర్వతశ్రేణుల్లో చివరిదైన లుంగ్సర్ కాంగ్రీ (6,666మీ)పై జాతీయజెండాతోపాటు తెలంగాణ లోగోను ఆవిష్కరించించాడు. దీంతో తెలంగాణ లోగోను హిమాలయాల్లో ఆవిష్కరించిన అరుదైన రికార్డు అహ్మద్ అలీ సొంతమైంది. అడ్వెంచర్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ లీడర్ కెప్టెన్ రంగారావు ఆధ్వర్యంలోని బృందానికి చెందిన ఏడుగురు సభ్యులు లుంగ్సర్ కాంగ్రీ పర్వతశ్రేణిని అధిరోహించారు. ఇందులో బోధన్ మండలానికి చెందిన అహ్మద్ అలీ ఒకరు. ఎవరెస్ట్ శిఖరారోహణ ధ్యేయంగా అహ్మద్ అలీ శిక్షణ పొందుతున్నాడు.
చిన్నతనం నుంచే..
చిన్నతనం నుంచే క్రీడల్లో అహ్మద్ అలీ రాణించాడు. విద్యాభ్యాసం చేసే రోజుల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన రన్నింగ్, హైజంప్, లాంగ్ జంప్ తదితర ఆటల్లో అనేకసార్లు పాల్గొన్నాడు. జిల్లాస్థాయిలో రన్నింగ్ పోటీల్లో పలుసార్లు ప్రథమ బహుమతులు సాధించాడు. అలీలో ఉన్న ఆసక్తికి నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు అలీసాగర్లో నిర్వహించిన సాహసక్రీడలు ప్రోత్సాహాన్నిచ్చాయి. 2014 నుంచి ఇప్పటి వరకు పలు సాహసక్రీడల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటడంతోపాటు పతకాలు సాధించాడు.
పలువురి మన్ననలు.. అభినందనలు..
అలీ అహ్మద్ పర్వతారోహకుడిగా, వాటర్ రాప్లింగ్తోపాటు పలు సాహసక్రీడల్లో ప్రతిభను చాటుతూ బోధన్ నియోజకవర్గానికి, స్వగ్రామానికి పేరు తెస్తున్నాడు. సాహస క్రీడల్లో ప్రతిభ చాటుతున్న అలీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందిస్తూ తన వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్థానిక బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సైతం సాయం అందించేందుకు హామీ ఇచ్చినట్లు అలీ అహ్మద్ తెలిపారు. సాహసక్రీడల్లో భాగంగా అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు గాయత్రీ వాటర్ఫాల్స్లో నిర్వహించిన వాటర్ రాప్లింగ్ క్రీడల్లో 17దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా.. అందులో అలీ అహ్మద్ ప్రతిభను చాటి పలువురి మన్ననలు పొందాడు. ప్రస్తుతం అలీ అహ్మద్ మైనార్టీ వక్ఫ్బోర్డు కార్యాలయం, హైదరాబాద్లో డెయిలీవేజ్ ఉద్యోగం చేయడంతోపాటు రాబోయే రోజుల్లో పర్వతారోహణకు శిక్షణ పొందుతున్నాడు.
మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా..
మౌంట్ ఎవరెస్ట్ శిఖరంతోపాటు ఎత్తయిన పలు పర్వతాలు అధిరోహించాలనే కోరిక ఉన్నది. ప్రస్తుతం హిమాలయ పర్వతాల్లోని కేటూ , మౌంట్ ఎవరెస్ట్ శిఖరాల అధిరోహణకు ఎంపికయ్యాను. శిక్షణ కొనసాగుతున్నది. పర్వతారోహణకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. దాతలు, ప్రభుత్వం సహకరించాలి. పర్వతారోహణతోపాటు సాహసక్రీడల్లో పాల్గొనేందుకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
– మహ్మద్ అలీ అహ్మద్, పర్వతారోహకుడు, అమ్దాపూర్