ఇందూరు : దేశంలో ప్రజలందరూ కలిసిమెలసి ఉంటూ ఐక్యతను చాటి చెప్పి సంఘ విద్రోహ శక్తులను సంఘటితంగా ఎదుర్కొనడానికి పోలీసులతో ప్రజలు సహకరించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ‘జాతీయ ఐక్యత దినోత్సవం’ సందర్భంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివాస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి పోలీస్స్టేషన్ నుంచి బైక్ర్యాలీ నిర్వహించారు. అదనపు డీసీపీ (అడ్మిన్) ఉషా విశ్వనాథ్ తిరునగిరి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ బైక్ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై నడ్పల్లి, ధర్మారం, మాధవనగర్, బోర్గాం బ్రిడ్జి, ఆర్యనగర్, వినాయక్నగర్, పూలాంగ్ బ్రిడ్జి, న్యాల్కల్ చౌరస్తా, బడాబజార్, నెహ్రూపార్కు చౌరస్తా, గాంధీచౌక్, రైల్వేస్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. అనంతరం జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించి సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఎఆర్) పి.గిరిరాజు, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు, ఎస్హెచ్వోలు, ఎస్సైలు డిచ్పల్లి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.