కమ్మర్పల్లి, ఆగస్టు 11: బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు చెక్ డ్యాంలను మంజూరుచేసింది. కొత్తగా మూడు చెక్ డ్యాంలు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ చెక్డ్యాంల నిర్మాణానికి రూ.14.42 కోట్ల నిధులు మంజూరుచేసింది.
కమ్మర్పల్లి మండలం కోనాపూర్ రాళ్లవాగులో కోనాపూర్ గ్రామ సరిహద్దు వద్ద రూ.4.10 కోట్లు, రాళ్లవాగులోనే గ్రామ సమీప ప్రాంతంలో రూ.3.97 కోట్లు, భీమ్గల్ మండలం సాలింపూర్ వద్ద రూ.6.35 కోట్లతో మూడు చెక్ డ్యాంలు మంజూరైనట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించగా కొత్తగా మూడు చెక్ డ్యాంలు మంజూరు చేసినట్లు తెలిపారు. అడిగిన వెంటనే మంజూరుచేసిన సీఎం కేసీఆర్కు బాల్కొండ నియోజక వర్గ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బాల్కొండ నియోజక వర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కప్పల వాగు, పెద్ద వాగు మీద చెక్ డ్యాంలు నిర్మించినట్లు తెలిపారు. దీంతో వాగులకు రెండు వైపులా భూగర్భ జలాలు పెరిగాయని, బోరు బావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొత్తగా చెక్డ్యాంల మంజూరుతో కమ్మర్పల్లి మండలం కోనాపూర్, భీమ్గల్ మండలం సాలింపూర్తోపాటు పరిసర ప్రాంత రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాళ్లవాగులో రెండు చెక్ డ్యాంలు మంజూరు చేయడంపై కోనాపూర్ రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ సీఎం కేసీఆర్, మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు రాజాగౌడ్, సర్పంచ్ దయా దేవయ్య, ఎంపీటీసీ గుగులోత్ గంగాధర్, విండో చైర్మన్ బడాల రమేశ్, ఉప సర్పంచ్ టేకుల జలంధర్ మాట్లాడుతూ.. తమ గ్రామ రైతాంగానికి శాశ్వతంగా మేలు జరిగేలా రాళ్లవాగులో రూ.8.7 కోట్లతో రెండు చెక్ డ్యాంలు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మేలు మరువలేమన్నారు. రాళ్ల వాగులో చెక్ డ్యామ్లు నిర్మించి రైతులకు మేలు చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మాదిరిగా ఇప్పటి వరకు ఏ నాయకుడు ఆలోచించ లేదని రైతులు సంతోషంగా చెబుతున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, మైలారం పురుషోత్తం, గంగాధర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.