డిచ్పల్లి, జూన్ 3 : టీయూ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తాపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టంచేశారు. హైదరాబాద్లోని రూసా భవనంలో శనివారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఇటీవల జరిగిన టీయూ పరిణామాలు, గతంలో పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్ మరోసారి డుమ్మాకొట్టారు. సమావేశంలో వీసీ చేసిన అక్రమాలపై విచారణ కమిటీ వేయాలని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన వైనం, దినసరి ఉద్యోగం కింద పనిచేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ. 28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
వీసీ ఇటీవల కనకయ్యను రిజిస్ట్రార్గా చేపట్టిన నియామకం చెల్లదని ఈసీ సభ్యులు స్పష్టంచేశారు. ప్రొఫెసర్ కనకయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. వీసీకి రిజిస్ట్రార్ను నియమించే అధికారం లేదని పాలకమండలి సభ్యులు తెలిపారు. పాలకమండలి తీర్మానించిన రిజిస్ట్రార్తోనే పరిపాలనా వ్యవహారాలను నిర్వహించాలని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీల చాన్స్లర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కలిసి వీసీ చేసిన అవినీతి, అక్రమాల చిట్టాను అందజేయాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. యూనివర్సిటీకి సంబంధంలేని సుశృత్రెడ్డిపై సైతం కేసు నమోదు చేయాలని తీర్మానించారు. ఈసీ అనుమతి లేకుండా యూనివర్సిటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీల్లేదని, దినసరి ఉద్యోగం కింద పనిచేసిన వారికి రూ.28 లక్షల 22 వేలు చెల్లించిన వాటిపై విచారణ చేపట్టి, రికవరీ చేసేలా ప్రత్యేకచర్యలు తీసుకోవాలని గవర్నర్, ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన పాలకమండలి సమావేశానికి యూనివర్సిటీకి చెందిన పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ నసీం, ప్రొఫెసర్ రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ ఆరతి హాజరుకావడంతో వారికి వీసీ రవీందర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. నోటీసుల విషయమై చర్చించారు. వీసీకి పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం లేదని స్పష్టంచేశారు. ఒకవేళ సస్పెండ్ చేయాలని అనుకున్నా యూనివర్సిటీ పాలకమండలి సభ్యుల అనుమతితోనే చేయాల్సి ఉంటుందని తెలిపారు. పాలక మండలి సమావేశాన్ని ఈనెల 17న మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. పాలకమండలి సమావేశానికి చంద్రకళ మినహా 12 మంది సభ్యులు హాజరయ్యారు.
కొలిక్కి వచ్చేదెన్నడో…
టీయూలో జరుగుతున్న పరిణామాలు ఇటు జిల్లా ప్రతినిధులు, అటు ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. టీయూ ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా కొన్నినెలలుగా ఈసీ వర్సెస్ వీసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో టీయూలో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇటు ఈసీ, అటు వీసీ మధ్య ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీయూలోని ఉద్యోగులు సైతం ఎవరి పక్షాన ఉండాలో అర్థంకాక మిన్నకుండిపోతున్నారు.
వర్సిటీ విషయాలు బయటికి చెబితే బదిలీ చేస్తా..
టీయూలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, లావాదేవీలు, ఇతర విషయాలను పత్రికలకు, యూనివర్సిటీ, బయటవ్యక్తులకు చెబితే యూనివర్సిటీ నుంచి బదిలీ చేస్తానని వీసీ రవీందర్ నాన్ టీచింగ్ సిబ్బందిని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. వీసీ టీయూలోని నాన్ టీచింగ్ సిబ్బందిని హైదరాబాద్కు రావాలని హుకూం జారీ చేయగా.. రెండు వాహనాల్లో హైదరాబాద్కు తరలివెళ్లినట్లు తెలిసింది. తనకు సహకరించకుండా ఇతర వ్యక్తులకు ఎలా సహకారం అందిస్తారని ప్రశ్నించి, చివాట్లు పెట్టినట్లు సమాచారం. మరోమారు ఇలాగే జరిగితే భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగాపూర్ బీఈడీ కళాశాలకు బదిలీ చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం అందింది.