హనుమకొండ సబర్బన్, జనవరి 24 : విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న అడిషనల్ కన్జప్షన్ డిపాజి ట్ (ఏసీడీ) నిర్ణయం తమ సొంత నిర్ణయం కాదని, ఎలక్ట్రిసి టీ రెగ్యులేషన్ కమిషన్ (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఏసీడీ వసూలు చేయనున్నట్లు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్ రావు స్పష్టం చేశారు. ఏసీడీపై కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యం లో హనుమకొండలోని విద్యుత్ భవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వినియోగదారులు నూతనంగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు నామ మాత్రపు డిపాజిట్ మాత్రమే చెల్లిస్తారని వివరించారు. వారు కొన్నాళ్ల పాటు విద్యుత్ను వినియోగించుకున్న తర్వాతే వినియోగం లోడ్ తెలుస్తుందని చెప్పారు.
దాని ప్రకారమే వారిపై ఏసీడీ విధించనున్నట్లు తెలిపారు. విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఈ నిబంధనలన్నీ దరఖాస్తులో పొందుపరుస్తాయని పేర్కొన్నారు. వెబ్సైట్లో చూసుకున్నా స్పష్టంగా ఉంటుందని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్న నెల రోజుల తర్వాత మొదటి నెల బిల్లు వస్తుందని, అది చెల్లించేందుకు 15 రోజుల గడువు ఉంటుందని, సర్చార్జితో కలిపి మరో 15 రోజుల గడువు ఉంటుందని పేర్కొన్నారు. అంటే మొదటి బిల్లు చెల్లించేందుకు వినియోగదారుడికి రెండు నెలల గడువు ఉంటుంది. ఈ రెండు నెలల్లో వినియోగదారుడు ఒప్పందం లోడుకు మించి అదనంగా విద్యుత్ను వాడుకుంటే ఏసీడీని క్రమబద్ధీకరించుకోవాలి. అది కూడా ప్రతి కిలోవాట్కు కేవలం రూ.200 చెల్లిస్తే సరిపోతుందని సీఎండీ వివరించారు.
ఈ క్రమంలో 100 యూ నిట్ల లోపు అయితే రూ.298, 150 యూనిట్లకు రూ.800, 200 యూనిట్లకు రూ.1664, 250 యూనిట్లకు 4 శాతం, 300 యూనిట్లకు ఒక శాతం మాత్రమే ఏసీడీ రూపేణా వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ ఈఆర్సీ 2004 సెక్షన్ 6 ప్రకారమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డిపాజిట్లకు కూడా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం వడ్డీని లెక్కించి ప్రతి నెల విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఈ డిపాజిట్ను విద్యుత్ బిల్లుగా పరిగణించొద్దని, ఇది కేవలం మీ పేరుతో మా వద్ద ఉండే ఫిక్స్డ్ డిపాజిట్గా మాత్రమే చూడాలని సూచించారు.