ఎల్లారెడ్డి, డిసెంబర్ 13 : ఎల్లారెడ్డి పట్టణంలో శనివారం జరిగిన శేర్ల సుజాత హత్య కేసులో నిందితుడు గంగుల శ్రీనివాస్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఒంటరిగా ఉన్న సుజాతను టార్గెట్ చేసి పథకం ప్రకారం హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడని తెలిపారు. సమాచారం అందిన వెంటనే సీఐ శ్రీనివాస్ విచారణ ప్రారంభించారని, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని విచారించి కేవలం మూడు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారన్నారు. విచారణలో ఎస్సై గణేశ్, సిబ్బంది సహకరించారని తెలిపారు. శ్రీనివాస్ నుంచి రెండు తులాల బంగారు గొలుసు, ఒక తులం బంగారు గుండ్లు రికవరీ చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఇప్పటికే పలుమార్లు తమను బెదిరించాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించి పంపించారు.
దొంగతనం కేసులో ఒకరు..
కల్లు దుకాణాల్లో ఉన్న వారిని టార్గెట్ చేసి దొంగతనాలు చేసే ఒకరిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎల్లారెడ్డి ఎస్సై గణేశ్ తెలిపారు. లింగంపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నీరడి సాయిలు ఈ నెల 10వ తేదీన ఎల్లారెడ్డిలోని కల్లు దుకాణంలో ఉన్న వృద్ధుడిని పలుకరించి అతనితో పాటు కల్లు తాగాడు. అనంతరం మద్యం తాగుదామని ఒప్పించి ఆదర్శ పాఠశాల సమీపంలోకి తీసుకెళ్లి మద్యం తాగించి ఆ వృద్ధుడి దగ్గర ఉన్న వెండి కడియాలు, బంగారు చెవి పోగులు దొంగతనం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి నమోదైన కేసులో సాయిలును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు.