నిజామాబాద్ క్రైం, జూన్ 29 : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడి సంఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ అధికారితో పాటు ఆయనకు సహకరించిన సూపరింటెండెంట్ ముచ్చటి వెంకటేశ్, జూనియర్ అసిస్టెంట్ రహీమాను ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు లోతుగా దర్యాప్తు నిర్వహించారు. అయితే రైతు నుంచి లంచం తీసుకున్న ఏడీ శ్యాంసుందర్ రెడ్డితో పాటు సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ల ఇండ్లపై సైతం ఏసీబీ బృందాలు దాడులు నిర్వహించాయి. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే కోణంలో దాడులు చేపట్టారు.
బుధవారం ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ సూచనల మేరకు ఇన్స్పెక్టర్లు నాగేశ్, శ్రీనివాస్, రమేశ్, రాజాగౌడ్ బృందాలు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో గల ఏడీ శ్యామ్ సుందర్ రెడ్డి, సూపరింటెండెంట్ వెంకటేశ్ అద్దె ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో హైదరాబాద్లో ఏసీబీ బృందాలు కూకట్పల్లిలోని ఏడీ శ్యాంసుందర్ రెడ్డి ఇంటితో పాటు గండి పేట్లోని సూపరింటెండెంట్ వెంకటేశ్ ఇండ్లపై సైతం దాడులు నిర్వహించారు. వారి ఇండ్లలో బుధ, గురువారం రెండు రోజుల పాటు కొనసాగిన సోదాల్లో సూపరింటెండెంట్ ఇంట్లో ఎలాంటి అక్రమ ఆస్తులు లభించలేదు. ఏడీ ఇంట్లో మాత్రం రూ.78 లక్షల 2వేల 700 నగదుతో పాటు బంగారు నగలు, వెండి వస్తువులు, బ్యాంక్ డిపాజిట్ బాండ్ పేపర్లు, విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. వాటిని హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో అప్పగించారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏడీతో పాటు ఆయనకు సహకరించి ముందుగానే లంచం తీసుకున్న సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్లను బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి గురువారం కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి రిమాండ్ విధిస్తూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురిని జైలుకు తరలించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.