నందిపేట్, ఏప్రిల్ 19 : మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీ నగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈనెల 24న నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన పనులను బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్కు ఆత్మీయ స్వాగతం పలుకడానికి ఔరంగాబాద్ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఔరంగాబాద్ జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరుకానున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక పార్టీ నాయకులకు సూచించారు. సభకు వచ్చేందుకు వివిధ రూట్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఔరంగాబాద్ జిల్లా చరిత్రలో బీఆర్ఎస్ సభ అతి పెద్దదిగా రికార్డు సృష్టిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. నాందేడ్, కందార్ లోహలో నిర్వహించిన సభలు లక్షలాది మంది ప్రజల దీవెనలతో సక్సెస్ కాగా.. ఔరంగాబాద్ సభ సూపర్ సక్సెస్ అయి మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న 450 పథకాలను ఔరంగాబాద్ సభ ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారన్నారు.
ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ప్రచార రథాల ద్వారా తెలంగాణ అభివృద్ధి గురించి ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక పథకం ద్వారా రాజకీయాలకతీతంగా అర్హులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాదిరిగా బీజేపీ వారికే పథకాలతో లబ్ధి చేకూరుస్తూ మిగతావారి కడుపు కొట్టే చిల్లర పనులకు కేసీఆర్ పూర్తిగా వ్యతిరేకమన్నారు. తెలంగాణలో సాధ్యమైన ఈ పథకాల అమలు.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. భారీ ఆదాయ వనరులు, అతి పెద్ద బడ్జెట్లో మొదటి వరుసలో ఉన్న మహారాష్ట్ర.. అభివృద్ధి సంక్షేమంలో మాత్రం ఆఖరి వరుసలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్ర ఎందుకు రైతుల ఆత్మహత్యలకు పరాకాష్టగా మారిందో అర్థం కావడం లేదన్నారు. ఇక్కడి పాలకుల నిర్వాకమే రైతాంగానికి ప్రాణసంకటంగా మారిందన్నారు. బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను అమలు చేస్తామన్నారు. అసాధ్యమనే పదానికి కేసీఆర్ డైరీలో చోటు లేదని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, ప్రముఖ వాస్తు నిపుణుడు తేజ శర్మ, యువనాయకులు అంకిత్ యాదవ్, శివాంక్ యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.