నిజామాబాద్ క్రైం, మార్చి 22: నిజామాబాద్ నగరంలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్పై ఓ విద్యార్థి తల్లి చేయిచేసుకున్నది. ఈ ఘటన మంగళవారం జరిగింది. త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై జి.శ్రావణ్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్ బ్యాంక్ కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ముగిసిన అనంతరం ఓ విద్యార్థిని తీసుకెళ్లేందుకు అతడి తల్లి వచ్చి గేటు వద్ద ఉన్నది.
అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ లత.. హాల్లో నుంచి పిల్లలు బయటికి వస్తున్నారని, పక్కకు వెళ్లాలని సూచించింది. దీంతో కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగిన సదరు మహిళ.. ఆమెపై చేయి చేసుకున్నది. విషయాన్ని సదరు కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అనంతరం త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. సీసీ ఫుటేజీల ఆధారంగా దాడిచేసిన మహిళ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న ఆఫ్రిన్ ఫిర్దోస్గా గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.