మాస్కులను పూర్తిగా ధరించడం.. సమూహాల్లో తిరగకపోవడం.. బయటకెళ్లినప్పుడు భౌతికదూరం పాటించడం.. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవడం.. సమయానికి చక్కటి ఆహారం తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వందశాతం దరిచేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది నిబంధనలు బేఖాతర్ చేయడం, లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకపోవడం, వైరస్తో బయట తిరగడం వల్ల వేగంగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొంటున్నారు. కరోనా స్వల్ప లక్షణాలుంటే ఇంట్లో ఉండడమే మేలని, అనవసరంగా ఆస్పత్రులకు పరుగులు తీయొద్దని సూచిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల కొరతకు ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు. మొదటిదశ కన్నా, రెండోదశ వైరస్ రంకెలేస్తుండడంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఓ వైపు నిర్ధారణ పరీక్షలు పెంచుతూనే మరోవైపు టీకాలను సాధ్యమైనంత ఎక్కువమందికి అందిస్తున్నది. కాగా రెండోరోజు బుధవారం రాత్రి కర్ఫ్యూ సజావుగా సాగింది. ప్రజలు ముందే అప్రమత్తమై రాత్రి 9 గంటలకల్లా ఇండ్లకు చేరారు.
గ్రేటర్వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుండడం కలకలం రేపుతున్నది. గతేడాది మొదటిదశ కరోనా కన్నా, రెండోదశ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో కట్టడికి ప్రభుత్వం, వైద్యాధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఒకవైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే మరోవైపు నియంత్రణకు టీకాల ప్రక్రియను చురుగ్గా కొనసాగిస్తున్నారు. వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు బారులు తీరుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ కావాల్సిన మందులు అందిస్తుండగా, పరిస్థితి ఇబ్బందిగా ఉన్న వారిని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానాగా మార్చారు. వీటితోపాటు ఎర్రగడ్డలో ఛాతి, ప్రభుత్వ ఆయుర్వేద, ఇతర ప్రభుత్వ దవాఖానాలలో ఉన్న పడకల సంఖ్యను రెట్టింపు చేసి బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉంది. పరీక్షలు, టీకా ప్రక్రియను వేగవంతం చేశాం. వచ్చే మూడునాలుగు వారాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా నిబంధనలు పాటించాలి. విధిగా మాస్క్ ధరించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం తప్పదు. -డాక్టర్ వెంకటి, డీఎంహెచ్వో