ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఔట్: పీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. సంప్రదాయ శ్రామిక శక్తిని మింగేస్తున్నది. అంతకంతకూ విస్తరిస్తున్న ఆటోమేషన్.. ఆందోళన కలిగించే స్థాయిలో కొలువులను కనుమరుగు చేస్తున్నది. పీడబ్ల్యూసీ తాజా సర్వేనే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ దృష్ట్యా అన్ని రంగాల్లో యాంత్రికీకరణ వేగంగా జరుగుతున్నదని, రాబోయే ఐదేండ్లలో మా ఉద్యోగాలు పోతాయని దాదాపు 40 శాతం మంది భయపడుతున్నారిప్పుడు. భారత్సహా 19 దేశాల్లో ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరిగిన ఈ సర్వేలో 32,500 మంది పాల్గొన్నారు. ఇందులో ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయని 60 శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, 48 శాతం మంది భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలుండబోవని అభిప్రాయపడ్డారు. ఇక 39 శాతం మంది తమ ఉద్యోగాలే పోతాయని చెప్పేశారు. కరోనా నేపథ్యంలో మనుషులకు బదులుగా సంస్థలు, పరిశ్రమల్లో యంత్రాల వినియోగాన్ని క్రమంగా పెంచుతుండటమే ఇందుకు కారణం.