కమ్మర్పల్లి, డిసెంబర్ 4 : ఉమ్మడి రాష్ట్రంలో బాల్కొండ నియోజక వర్గ రైతాంగం అనేక కరెంటు తిప్పలను ఎదుర్కొన్నది. ఎస్సారెస్పీ నాన్ కమాండ్ ఏరియాలో సాగు నీటికి బోరు బావులే ఆధారం కాగా ఈ ప్రాంతానికి తొమ్మిదేండ్ల క్రితం కరెంటు కొరత తీవ్రంగా ఉండేది. సాగు నీటి వనరులు లేక రైతులు అడుగడుగునా బోరు బావులు వేస్తూ అప్పుల పాలయ్యేవారు. నాణ్యమైన, సరిపడా కరెంటు లేక మోటర్లు పదేపదే కాలి పోతుండేవి. పెట్టుబడి కోసం చేసిన అప్పుడు తీరకుమందే మరమ్మతులకు, కొత్త మోటర్లకు కొత్త బాకీలు చేస్తూ నష్టాల సాగు చేసే వారు. తమ ఇల్లాలి పుస్తెలు కూడా అమ్ముకొని రోడ్డున పడ్డ రైతు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పంటలు పండక, అప్పుల బాధలు భరించలేక బలవన్మరణాలు కనిపించేవి. కరెంటు సమస్యలతో వ్యవసాయం చేయలేక తల్లి లాంటి భూమిని అమ్మేసి.. అన్నం పెట్టే రైతులే పొట్ట చేతపట్టుకొని గల్ఫ్బాట పట్టిన విషాదాలు కంట తడి పెట్టించేవి. అలాంటి పరిస్థితుల్లో స్వరాష్ట్రం సాకారమయ్యాక కేసీఆర్ ప్రభుత్వం రెండేండ్లలోనే కరెంటు సమస్యలను తీర్చడం మొదలుపెట్టింది. బాల్కొండ నియోజక వర్గంలోనూ ఆ ఫలితాలు అందించడానికి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వేముల ప్రశాంత్రెడ్డి నడుం కట్టారు. నియోజక వర్గంలో విద్యుత్ సమస్యలపై అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా విన్నవించి ఏకంగా పది సబ్స్టేషన్లు మంజూరు చేయించారు. పది సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ఒకేరోజు శంకుస్థాపన చేయడం రాష్ట్రంలోనే అప్పట్లో చర్చనీయాంశమైంది. రైతుల్లోనూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అనంతరం మరో 8 సబ్ స్టేషన్లు మంజూరు చేయించారు. నియోజక వర్గానికి కొత్తగా మొత్తం 18 సబ్ స్టేషన్లు సమకూర్చారు. వీటితోపాటు ఏకంగా 42 సబ్ స్టేషన్లలో 5ఎంవీఏ ట్రాన్స్ఫార్లను ఏర్పాటు చేయించారు. దీంతో రైతులు తమ భార్యల పుస్తెలమ్మిన చోటనే నేడు పుష్కలంగా కరెంటును అందుబాటులోకి తేవడంతో పుట్లకొద్దీ ధాన్యం పండిస్తున్నారు. తెలంగాణ ఫలాలు ప్రతిబింబించే ఎన్నో మైలు రాళ్లు బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాయి.