పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా వాతావరణాన్ని కల్పించాలి. విద్యార్థులకు అర్థంకాని సబ్జెక్టులపై వారి ఉపాధ్యాయుల ద్వారా సందేహాల నివృత్తి కోసం సహకరించాలి. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల స్థాయిలను గుర్తించి వారికి అవసరమైన మెటీరియల్ను అందించాలి. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి. ఉన్న సమయంలో అన్ని సబ్జెక్టులను సరైన ప్రణాళికతో చదివేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
– ఎన్వీ దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్
పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. ర్యాంకులు, జీపీఏ అంటూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనకు గురై చదివిన సబ్జెక్టులను కూడా మరిచిపోయే ఆస్కారం ఉన్నందున వారిపై ఒత్తిడి పెంచకండి. పట్టు సాధించని సబ్జెక్టులపై నిపుణులైన ఉపాధ్యాయులతో తరగతులు లేదా సందేహాల నివృత్తి చేస్తే పట్టు సాధించే అవకాశం లేకపోలేదు. విద్యార్థులను గ్రూప్ డిస్కషన్స్, పాఠ్యాంశాలపై తోటి విద్యార్థులతో చర్చ లాంటివి వారిలో విశ్వాసాన్ని పెంపొందిస్తాయి.
– డాక్టర్ ఆకుల విశాల్, మానసిక వైద్య నిపుణుడు, నిజామాబాద్