దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. తొమ్మిదేండ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని కండ్లకు కట్టినట్లు వక్తలు వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని సన్మానించారు. ఎల్ఈడీ స్క్రీన్లపై విద్యుత్ ప్రగతిని ప్రదర్శించి, ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
బాన్సువాడ/ బాన్సువాడ టౌన్ 5: విద్యుత్ రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ అని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్లో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించడానికే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ర్టానిది సక్సెస్ స్టోరీ అన్నారు. అంధకారం నుంచి వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
వ్యవసాయ , పారిశ్రామిక రంగాలకు విద్యుత్తే ముఖ్యమన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా అవుతున్నదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఉచిత విద్యుత్ లేదని, పైగా మోటర్లకు మీటర్లు పెట్టారని వివరించారు. మన రాష్ట్రంలో కూడా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్ఎంబీ కింద ఏటా రూ.6వేల కోట్ల రుణం ఇస్తామని కేంద్రం లెటర్ పంపిందని అన్నారు. కానీ ఎంత నష్టం వచ్చినా, మీరు రుణం ఇవ్వకపోయినా ఫర్వాలేదని, తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టబోమని కేసీఆర్ ధైర్యంగా చెప్పారని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 27. 49లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఒక్కో రైతుపై రూ. 40వేల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో విద్యుత్ సబ్స్టేషన్లు, సరఫరా కోసం రూ.525 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దామరంచలో రూ.70కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో 43వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వీటి కోసం ఏటా సుమారు రూ.170 కోట్లు సబ్సిడీ ఖర్చు అవుతుందని తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయడంతోనే సత్ఫలితాలు సాధించగలిగామని స్పీకర్ పోచారం అభినందించారు. రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
సమావేశానికి ముందు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి మొక్కను నాటారు. బాన్సువాడ సబ్స్టేషన్లో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఈ రమేశ్బాబు, ఏడీ శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు భూషణ్రెడ్డి, సంగ్రాం నాయక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.