పిట్లం, సెప్టెంబర్ 27 : అసలే భారీ వర్షం.. గ్రామం చుట్టూ వరద ప్రవాహం.. నాలుగు రోజులుగా ఆ ఊరికి రాకపోకలు నిలిచిపోయాయి. మౌఖికంగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇంతలోనే ఓ పద్దెనిమిది నెలల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఏమీ చేయలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న రెవెన్యూ, వైద్యాధికారులు అప్పటికప్పుడు తీసుకున్న చర్యలతో ఆ గ్రామానికి మందులు చేరుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామం నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈ గ్రామానికి వెళ్లేందుకు ఉన్న పాత వంతెన పైనుంచి భారీగా వరద ప్రవహిస్తున్నది. దీంతో ఇతర గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కుర్తి గ్రామానికి చెందిన మిర్యాల గంగారాం కుమారుడు(18 నెలలు) కడుపునొప్పితో బాధపడ్డాడు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు ఫోన్ ద్వారా వివరించారు. దీంతో వారు రెవెన్యూ, వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన అధికార యంత్రాంగం డ్రోన్ సహాయం తీసుకున్నది. బాబుకు కావాల్సిన మందులను డ్రోన్ సహాయంతో కుర్తి గ్రామంలోని కుటుంబానికి అందించారు. మందులు అందడానికి చొరవ చూపిన వైద్యాధికారుడు శివకుమార్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.