ఖలీల్వాడి (మోపాల్ ), జూలై 19:చుట్టూ పచ్చని పొలాలు.. కొండలతో కనువిందు చేస్తున్నది మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామం. 3278 మంది జనాభా ఉన్న ఈ గ్రామం మొన్నటిదాక సమస్యలతో సతమతమైంది. పారిశుద్ధ్య లోపంతో తీవ్ర అవస్థలు పడింది. అరకొర నిధులు, అర్ధాంతరంగా నిలిచిన పనులతో ఆగమాగమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో సరికొత్త అందాలు అద్దుకొని అభివృద్ధి బాటలో పయనిస్తున్నది.
పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ
ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే.. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపును మంచిప్ప గ్రామ పంచాయతీ పాలకవర్గం తు.చ తప్పకుండా పాటిస్తున్నది. డ్రైనేజీలు, రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.6లక్షలతో శానిటేషన్ వాహనాన్ని కొనుగోలు చేశారు. వాహనాన్ని ఇంటింటికీ తిప్పుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తూ పంచాయతీకి ఆదాయం సమకూరుస్తున్నారు.
పచ్చని తోరణంలా..హరితహారంలో భాగంగా యేటా నాటుతున్న మొక్క
లతో మంచిప్ప పచ్చని తోరణంలా మారింది. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఉదయం, సాయంత్రం గ్రామస్తులు సేదతీరేలా సౌకర్యాలు కల్పించారు. వనంలో నాటిన వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఇంటింటికీ ఆరు మొక్క లు పంపిణీ చేస్తూ వాటిని సంరక్షించేలా అవగాహన కల్పిస్తున్నారు. యేటా పదివేల మొక్కలను గ్రామంలో నాటుతూ హరిత పల్లెగా తీర్చిదిద్దుతున్నారు.
ముమ్మరంగా అభివృద్ధి పనులు..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిప్ప దశ మారింది. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో అందంగా కనిపిస్తున్నది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదిక భవనాన్ని నిర్మించింది. దీంతో వ్యవసాయాధికారుల సమావేశాలు, రైతుల సమావేశాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలిగింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాలు బిగించి శుద్ధమైన తాగునీరు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో 25 మినీ వాటర్ ట్యాంకులను నిర్మించారు.
తీరిన చివరి మజిలీ చింత..
గతంలో శ్మశాన వాటికలకు స్థలం లేక చెరువులు, వాగుల పక్కన అంత్యక్రియలు నిర్వహించేవారు. కానీ ఇక నుంచి ఆ సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో విడుదల చేసిన నిధులతో వైకుంఠధామాన్ని నిర్మించారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, నీటి సౌకర్యం కల్పించారు. వైకుంఠధామం ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
అందరి సహకారంతో..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతోపాటు గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతు న్నాం. గతంలో గ్రామంలో ఎలాంటి వసతులు ఉండేవి కావు. పల్లె ప్రగతి కార్యక్రమంతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. గ్రామంలో ఎక్కడా అపరిశుభ్రత కనిపించకుండా చేశాం. జీపీ నిధులతో శానిటేషన్ వాహనం కొనుగోలు చేసి చెత్తను సేకరిస్తున్నాం. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, రైతువేదిక భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేశాం.
చాలా అభివృద్ధి చెందింది..
పల్లె ప్రకృతి కార్యక్రమంతో మా ఊరు చాలా అభివృద్ధి చెందింది. గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు ఇలాంటి పనులు చేయలేదు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇం టింటికీ వచ్చి చెత్తను తీసుకెళ్తున్నారు. దీంతో గ్రామం మొత్తం పరిశుభ్రంగా మారింది. ప్రతి వాడలో రోడ్ల పక్కన మొక్కలు నాటడంతో ఎటు చూసినా పచ్చదనంతో నిండిపోయింది. పట్టణ పార్కును మరిపించేలా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-కామేశ్వర్ రావు, గ్రామస్తుడు