నిజామాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కాలంటే ఒకప్పుడు పేదవారికి జంకు మొదలయ్యే ది. ఎవరైనా అధికారిని కలవాలన్నా భయం ఉండేది. కార్యాలయాల్లో ప్రజలకు సేవ చేయాల్సిన అధికారుల తీరుతో ప్రజలంతా పరోక్షంగా ప్రభుత్వ పథకాలకు దూరంగానే ఉండేవారు. దీంతో మధ్యవర్తులు అధికమై… నిరుపేదల చాటున సంక్షేమ ఫలాలను కొల్లగొట్టేవారు. అడుగడుగునా పేదోడిని ముంచేసి… వారు పైకి వచ్చే స్థితి కనిపించేది. కానిప్పుడు అన్నింటా మార్పు వచ్చింది. ఏ కార్యక్రమమైనా సులువుగా జరిగే వీలు దొరికింది. అలాగే పేదోడికి న్యాయం దొరికే వేదిక లభించింది. రాష్ట్రంలో నిరుపేదలకు టీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ ఫలాలను ముంగిటకు తీసుకువచ్చింది. వృద్ధులకు, మహిళలకు, అణగారిన వర్గాలను ఉన్నతిలోకి తీసుకు వచ్చేందుకు అమలు చేస్తోన్న కార్యక్రమాలు ఎన్నో ఫలితాలను అందిస్తోంది. సామాజిక అంశంతో ముడిపడి ఉన్న ఫించన్లతో కేసీఆర్ సర్కార్ ఉదారతను చాటుకున్నది. వందలాది స్కీములతో ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ కొండంత అండగా ముఖ్యమంత్రి నిలుస్తున్నారు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామంలోనైనా, ఏ వీధిలోనైనా, ఏ కుటుంబంలోనైనా తరచి చూస్తే ఒకటికి కన్నా ఎక్కువ పథకాలు పొందుతున్న వారే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
బతుకుపై భరోసా ..
ఎడపల్లికి చెందిన శిరిషెట్టి నాగేశ్వర్ ప్రైవేటు ఉద్యోగి. భార్య లక్ష్మి బీడీ కార్మికురాలు. ఇద్దరు కష్టపడితేనే కుటుంబ పోషణ సాగేది. ఇటువంటి సమయంలో నాగేశ్వర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కుటుంబ పోషణ మొత్తం లక్ష్మిపైనే పడింది. ప్రమాదంతో అంగవైకల్యం ఏర్పడగా పనులు చేసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆసరా పథకం కింద పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది. దీంతో నెలకు రూ.3,016 పింఛన్ వస్తున్నది. లక్ష్మికి జీవనభృతి అందుతున్నది. ఒక్కగానొక్క కూతురైన నేహ వివాహం ఇటీవల చేశారు. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల క్రితమే మంజూరైనట్లు మెస్సేజ్ వచ్చింది. గ్రామ శివారులోని కొద్దిపాటి పొలానికి గాను ‘రైతు బంధు’ పథకం కింద ప్రభుత్వ పరంగా డబ్బులు అందుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు తమలాంటి వారికి బాసటగా నిలుస్తున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలోఆపద్బాంధవుడిలా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పొలాస వాణి ప్రసాద్- నవ్యశ్రీ. వీరిది నందిపేట్ మండలం బజార్ కొత్తూర్ గ్రామం. వీరికి ఇద్దరూ ఆడపిల్లలు. కుటుంబ పోషణ అంతా వీరిపైనే ఆధారం. వాణి ప్రసాద్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. ఈ కుటుంబానికి 3 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. దీనికి గాను సుమారుగా ఏడాదికి రూ. 36 వేల దళితబంధు అందుతున్నది. సాగుకు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నది. నవ్యశ్రీ బీడీ కార్మికురాలు ఆమెకు ప్రతి నెలా రూ. 2,116 పింఛన్ వస్తున్నది.
వాణి ప్రసాద్ అనారోగ్యంతో దవాఖానలో చేరగా ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇటీవల రూ.10 వేలు మంజూరయ్యాయి. అద్దె ఇంట్లో ఉంటున్న తమకు అందరితో పాటు రాబోయే రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు అందుతుందని ధైర్యంగా చెబుతున్నారు.
నేనున్నానంటూ..
తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ తండ్రిలా, అన్నలా ముందుండి ఆదుకుంటున్నారు. కరోనాతో ప్రైవేటు విద్యా వ్యవస్థ కుప్పకూలింది. అందులో పని చేసే వారందరికీ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం, 25 కిలోల సన్నబియ్యం అందించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 13వేల మందికి ఈ సాయం అందింది. నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ నెలలో 5,804 మందికి సాయం అందింది. మే నెలలో అదనంగా 3,288 మందిని చేర్చారు. మొత్తం 9వేల 102 మందిని గుర్తించి రూ.2వేలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. వీరందరికీ 227 మెట్రిక్ టన్నులు సన్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసింది. కామారెడ్డి జిల్లాలో ఏప్రిల్ నెలలో 1996 మందికి సాయం అందింది. మే నెలలో అదనంగా 1,110 మంది వివరాలను చేర్చారు. మొత్తం 3,106 మందికి లబ్ధి చేకూరింది. వీరికి 77 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,208 మందికి రూ.2.44 కోట్ల నగదు జమ చేయగా… 305 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని సరఫరా చేశారు.
అభాగ్యులకు ఆసరా..
ఆసరా కోల్పోయిన అభాగ్యులకు పింఛన్లు నిరంతరాయంగా మంజూరవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం లో వృద్ధాప్య పింఛన్లు రూ.200 చేతికి అందేది. అది కూడా దళారులు, మధ్యవర్తులు కమీషన్లు పుచ్చుకోగా నడవ చాతకాని వృద్ధులకు చేరేది గగనమే అయ్యేది. ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ పంపిణీని మానవతా హృదయంతో చేపట్టారు. దళారులను నిలువరించడంతో పాటు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తు లు, బోదకాలు బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్లు మంజూరు చేస్తున్నారు. దివ్యాంగులకు రూ. 3,016 మంజూరు అవుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక నెలలో అన్ని రకాల పింఛ న్లు కలుపుకొంటే 4లక్షల 13వేల 694 మం ది లబ్ధిదారులున్నారు. వీరికి ఒక్క నెలలోనే మొత్తం రూ.87.22 కోట్లు మంజూరు అవుతుండడం విశేషం.
అంగన్వాడీలకు అండగా..
గతంలో అంగన్వాడీలు, ఆయాలు చాలీచాలని జీతాలతో సతమతమయ్యేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతర కాలం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా వీరికి వేతనాలు పెరిగాయి. సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 9నెలలకు అంగన్వాడీ టీచర్లకు రూ.4,200 నుంచి రూ.7వేలకు పెంచారు. మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.2,200 నుంచి రూ.4,500 వేతనాలు పెరిగాయి. 2017 ఫిబ్రవరి 27న అంగన్వాడీ టీచర్లకు రూ.7వేల నుంచి రూ.10,500, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6వేలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇటీవల 30శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అంగన్వాడీ, ఆశ, హోంగార్డు తదితర అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ వర్తింపజేస్తామని సర్కారు ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర్వులు జారీ కావడంతో ఏడేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు మూడు రెట్ల కన్నా అధికంగా 325 శాతం, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడున్నర రెట్లు 354శాతం వేతనాలు పెరగడం విశేషం.
రైతుబీమా ధీమా..
రైతుబీమా పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఐదున్నర వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. గతంలో అన్నదాత కుటుంబంలో పట్టాదారు చనిపోతే పైసా పరిహారం అందేది కాదు. సీఎం కేసీఆర్ తీసుకున్న వినూత్న పథకంతో ఆ కుటుంబానికి నేడు ఎంతో మేలు జరుగుతోంది. అనేక కారణాలతో అకాల మరణం చెందుతున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడమే రైతు బీమా పథకం ప్రధాన ఉద్దేశం. నిజామాబాద్ జిల్లాలో మూడేండ్లలో 2,616 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున అందింది. దాదాపు మొత్తం రూ.130.80 కోట్లు చెల్లింపులు జరిపారు. కామారెడ్డి జిల్లాలో 2,877 మంది రైతులు చనిపోతే రూ.5లక్షల చొప్పున అర్హులైన ఆయా కుటుంబాలకు ఎల్ఐసీ ద్వారా రైతుబీమా రూ.143.50 కోట్లు అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,493 మందికి బీమా పరిహారం అందింది.
గ్రామాల్లో మత్స్యాభివృద్ధి..
చెరువుల్లో పుష్కలంగా వనరులున్నప్పటికీ గతంలో చేప పిల్లలు వదలాలంటే మత్స్యకారులకు భారం గా ఉండేది. ఇప్పుడు మత్య్సకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై చెరువులు, కుంట ల్లో చేప పిల్లలను విడుదల చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 2021 – 2022లో 895 చెరువులు, ఒక రిజర్వాయర్లో కలిపి 5కోట్ల 30 లక్షల చేప పిల్లల విత్తనాలను వదలాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 605 చెరువుల్లో 3కోట్ల 30 లక్షల చేప పిల్లలు పెంచాలని ప్రణాళికలు రచించారు. నిజామాబాద్ జిల్లాలో 249 మత్య్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా ఇందులో 16,826 మంది సభ్యులున్నారు. కామారెడ్డి జిల్లాలో 147 మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో 13,170 మంది సభ్యులున్నారు.
రుణ విముక్తి..
రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ అమలు చేస్తున్నారు. తొలి విడుతలో రూ.25వేలలోపు రుణాలను మాఫీ చేశారు. ఈ మధ్యనే రూ.50వేలలోపు రుణాలను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే రూ.75వేల లోపు రుణాలు సైతం మాఫీ కానున్నాయి. నాలుగో దశలో రూ.లక్ష వరకు ఉన్న రుణాలను సర్కారు రద్దు చేయబోతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.50వేలలోపు దాదాపుగా 57వేల మంది రైతులున్నారు. వారికి రూ.175 కోట్లు వరకు మాఫీ అయ్యింది. జూన్ 2020లో తొలి విడుతలో రూ.25వేలలోపు అప్పు ఉన్న రైతుల రుణం మాఫీ చేసింది. జిల్లాలో వేలాది మందికి అప్పట్లో రుణ మాఫీ జరిగింది. ఆగస్టులో రూ.50వేల లోపు రుణం ఉన్నవారికి మాఫీ చేసింది. డిసెంబర్ 11, 2018 నాటికి రూ.లక్ష అప్పు ఉంటే మాఫీ చేసేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రైతు మేలు కోరుతూ సర్కారు తీసుకున్న రుణ మాఫీ ప్రక్రియ పేద రైతులకు రుణ విముక్తి చేస్తున్నది.
పశు సంపద వృద్ధి..
మాంసాహార మార్కెట్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని ఆశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగానే పల్లె ల్లో జీవాల సంపద పెరిగింది. ప్రభు త్వం పంపిణీ చేసిన జీవాల విలువతో పోల్చితే ప్రస్తుతం ప్రతి గొర్రెల యూనిట్లో 13 చొప్పున జీవాలు పెరిగాయి. వీటి పెంపుదలతో పల్లెల్లో జీవాల సంపద సృష్టి జరిగినట్లు అర్థం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రెండో విడుత లబ్ధిదారుల జాబితా ఇప్పటికై సిద్ధమైంది. త్వరలోనే అర్హులైన వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయబోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ‘ఏ’ జాబితాలో 9631 మందికి లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఇందు లో 8522 మంది డీడీలు కట్టారు. వీరందరికీ ఇదివరకే గొర్రెల యూ నిట్లు అందించారు. ‘బీ’ లిస్టులో 5123 డీడీలు రాగా 1103 మందికి యూనిట్లు అందించారు. కొందరు డీడీలు రిటర్న్ తీసుకోగా 1104 డీడీలున్నా యి. వీరందరికీ ఈ దఫా జాబితాలో యూనిట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో ‘ఏ’ జాబితాలో 8349 యూని ట్లు, ‘బీ’ లిస్టులో 1744 మందికి యూనిట్లు అందించారు. రెండో విడుతలో 705 మంది డీడీలు కట్టిన వారుండడంతో వీరందరికీ యూనిట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో గొర్రెల యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. వీటి విలువ రూ.1.25లక్షలు కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే అదనంగా రూ.50వేలు పెంచా రు. యూనిట్ విలువ రూ.1.75 లక్షలకు చేరింది.