నిజామాబాద్, అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాల తీరు విస్మయానికి గురిచేస్తోంది. గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి దొంగలు ఇష్టారీతిన తెగబడుతున్నారు. తాళం వేసిన ఇండ్ల ను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నా రు. దొంగతనాల కేసుల్లో అత్యధికంగా రాత్రివేళల్లోనే ఉంటున్నాయి. కరుడు గట్టిన ముఠాలైతే పగలూరాత్రీ తేడాలేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పగటివేళ సాధారణ వ్యక్తుల్లా వీధుల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, పక్కా స్కెచ్తో అర్ధరాత్రి వేళ పనికానిస్తున్నారు. ‘డెడ్ ఆఫ్ ది నైట్’గా పిలిచే అర్ధరాత్రి సమయాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాలు, శివారు కాలనీలు, దూరంగా నెలకొన్న నివాస సముదాయాల ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దొంగతనం చేసి ఈజీగా తప్పించుకునేందుకు ముందస్తుగానే మా ర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తద్వారా పోలీసులకు చిక్కకుండా దొంగలు మాయమవుతున్నారు.
చిమ్మచీకట్లు కమ్ముకునే నిశీధి రాత్రులను ఆంగ్లంలో ‘డెడ్ ఆఫ్ ది నైట్’గా పిలుస్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు గాఢనిద్రలో ఉండే సమయం. జనసంచారం దాదాపుగా శూన్యానికి చేరే కాలాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
రాత్రివేళ విడివిడిగా సంచరించడంతోపాటు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుండడంతో ఇతరుల దృష్టి వీరిపై పడడం లేదు. ఎక్కడైనా దొంగతనానికి అనువైన ప్రాంతం చిక్కితే ఇక అంతే సంగతి. ఇలా వెళ్లి 15 నుంచి 20 నిమిషాల్లోనే తాళం వేసిన ఇంటిని గుల్ల చేసుకుని వచ్చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లుగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన దొంగతనాలు కేసుల పూర్వాపరాలు పరిశీలిస్తే కారుచీకట్లలోనే దొంగలు రెచ్చిపోతున్నట్లుగా అవగతమవుతున్నది. 2018లో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో మొత్తం 200 దొంగతనాలు నమోదయ్యాయి. ఇందులో పగటిపూట 29, రాత్రివేళ 171 చోరీలు జరిగాయి. 2019లో 259 దొంగతనాలు వెలుగు చూడగా.. పట్టపగలు 32, రాత్రిపూట 227 వరకు ఉన్నాయి. 2020లో 181 చోరీలకు పాల్పడినట్లుగా పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పగటిపూట 29 దొంగతనాలు జరుగగా, రాత్రివేళల్లో 152 చోరీలు వెలుగుచూశాయి. 2021లో ఇప్పటివరకు మొత్తం 214 దొంగతనాలు జరిగాయి. పట్టపగలు జరిగిన చోరీలు 31 కేసులు నమోదు కాగా.. అర్ధరాత్రి వేళ జరిగిన దొంగతనాలసంఖ్య 181 వరకు ఉన్నాయి.
తాత్కాలిక నివాసాలు…
గత కొన్నేండ్లుగా నిజామాబాద్ నగరంతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి. రైల్వే కనెక్టివి టీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు క్ర మంగా పెరిగాయి. పొరుగురాష్ర్టాల నుంచి సులువుగా జిల్లాకు వచ్చేస్తున్న అంతర్రాష్ట్ర చోరులు మూడు నుంచి నాలుగు రోజులపాటు ఎంచుకున్న ప్రాంతాల్లో తిరుగుతున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతలోపే రెక్కీ నిర్వహించడం, రాత్రివేళల్లో అదును చూసి తాళంవేసిన ఇండ్లను గుల్ల చేసి వెళ్లిపోవడం చకచకా జరుగుతోంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లనే ఆశ్రయం చేసుకుని అనుమానం రాకుండా తిరుగుతున్నారు. బస్సు కోసమో, రైలు కోసమో నిరీక్షిస్తున్నట్లుగా నటిస్తూ రాత్రుల్లో తమ పని కానిచ్చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాల్లో కొంద రు కుటుంబ సభ్యులతో వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ప్రాంతంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని.. మహిళలతో కాలనీల్లో భిక్షాటన చేయించడం ద్వారా తాళాలు వేసిన ఇండ్లను గుర్తించే పనిని అప్పగిస్తున్నారు. పురుషులు దొంగతనాలకు పాల్పడి వీరి వద్దకు చేరుకుంటున్నారు. అవసరమైతే పిల్లల ఆరోగ్యం బాగోలేదంటూ నమ్మించే ప్రయత్నం చేసి మెల్లిగా తాత్కాలిక నివాస ప్రాంతాల నుంచి జారుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూస్తున్న పలునేరాలపై డీజీపీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. ప్రతిరోజూ ఎక్కడో ఒక దగ్గర చోరీలు నమోదవుతూనే ఉన్నాయి.
త్వరలో సీపీ ప్రత్యక్ష తనిఖీలు
దొంగతనాల నివారణకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రత్యేకించి నిజామాబాద్ నగరంలో పోలీసుల పనితీరుపై ఇటీవలి కాలంలో విమర్శలు తీవ్రమయ్యాయి. వన్టౌన్ ఏరియాలో విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నా నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. వాణిజ్యప్రాంతంలోనే దొంగలు ఎక్కువగా స్థావరాలను ఏర్పా టు చేసుకుంటున్నారు. పెట్రోలింగ్ నిర్వహణలో నగరంలోని ఆరు పోలీస్ స్టేషన్లలోని బాధ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. పోలీస్ కమిషనర్ కార్తికేయ పలుమార్లు హెచ్చరించినప్పటికీ కిందిస్థాయి సిబ్బందిలో మార్పు కనిపించడం లేదు. త్వరలోనే సీపీ కార్తికేయ రాత్రివేళల్లో తనిఖీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానమైన బస్టాండు ప్రాంతంలో కొద్దిరోజుల క్రితమే వెలుగు చూసిన లైంగికదాడి ఘటన, బాలిక అదృశ్యం, బంగారం దొంగతనాల కేసుల మూలంగా నగరంలో నేరనియంత్రణకు సీపీ సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం. ఇందులోభాగంగా దొంగల ముఠాలతో చేతులు కలిపి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఇంటిదొంగల భరతం పట్టాలని భావిస్తున్నట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాత్రివేళల్లో పెట్రోలింగ్ వాహనాల కదలికలు, ఠాణాల్లో సిబ్బంది పనితీరు ఏవిధంగా ఉందనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సిద్ధమైనట్లుగా సమాచారంతో ఖాకీల్లో కలవరం మొదలైంది. చోరీల నివారణకు ప్రజల్లోనూ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలని, అప్రమత్తంగా ఉండాల్సిన విధానాలపై సూచనలు అందించేందుకు పోలీసులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.