నిజాంసాగర్/బిచ్కుంద /నాగిరెడ్డిపేట్ / విద్యానగర్, జూలై 18 : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బిచ్కుంద మండలకేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పువాయిద్యాల మధ్య బోనాలను ఊరేగిస్తూ పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో బోనాలు, నైవెద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెదలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. బోనాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి మహంకాళీ అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఊర పండుగను ఘనంగా న్విహించారు. ఆదివారం ఉదయం గ్రామచావిడి వద్ద గ్రామపెద్దలు జెండా ఊపి పండుగ కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గ్రామపెద్దలు గ్రామ దేవతలకు బ్యాండు మేళాల మధ్య పట్టువస్ర్తాలు, నైవేద్యాన్ని తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ బోనాలను ఊరేగించారు. ఆలయాల్లో అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనభోజనాలకు వెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుసూయ, ఎంపీటీసీ సుజాత, నాయకులు సత్యనారాయణ, రమేశ్, బలరాం, దాచ కిషన్, శ్రీనివాస్, మర్పల్లి రాములు, ఎల్లయ్య పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో హోలియా దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, దేవునిపల్లిలోని దేవీ విహార్లో కాలనీ మహిళలు ఆదివారం బోనాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.