నిజాంసాగర్/ లింగంపేట/ సదాశివనగర్/ పిట్లం/తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, జూలై 16 : జిల్లాలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగుపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. మరికొన్ని గ్రామాల్లో పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
వెదజల్లే విధానం పరిశీలన
లింగంపేట మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రేమ్సింగ్ వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తున్నాడు. విత్తనాలను వెదజల్లే విధానాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్గౌడ్ శుక్రవారం పరిశీలించారు. మండలంలోని బూరుగిద్ద, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల గ్రామాల్లో రైతులు వెద్దజల్లే విధానంలో వరి పంటను సాగుచేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో కలుపు సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుందని, కలుపు నివారణ కోసం పెండెథిలీన్ మందును వరి విత్తనాలు చల్లిన మూడు రోజుల తర్వాత పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో నవ్య, రైతులు ఉన్నారు.
యూరియా తక్కువగా వినియోగించాలి
లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ రైతువేదిక భవనంలో ఏఈవో ప్రశాంత్ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పంటకు మోతాదుకు మించి యూరియా వినియోగించడంతో అగ్గితెగులు సోకే అవకాశం ఉందని తెలిపారు. వరినాటు వేసిన నుంచి కలుపు దశ వరకు నీరు తక్కువగా ఉంచాలని సూచించారు. సమావేశంలో రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డ్డినేటర్ గంగారెడ్డి, సభ్యుడు సాయికుమార్, రిలయన్స్ ఫౌండేషన్ సభ్యుడు స్వామి, రైతులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండల పరిధిలోని చిట్యాల రైతువేదిక భవనంలో ఏవో శ్రీకాంత్ రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడితే భూసారం తగ్గి దిగుబడి తక్కువగా వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఎంపీటీసీ రాజమణి, ఏఈవో లిఖిత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేయాలని ఏఈవో స్నేహలతాగౌడ్ అన్నారు. సదాశివనగర్ మండలంలోని మోడెగామ గ్రామంలో వరి నాట్లు వేసే విధానాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ సీఆర్పీ వినాయక్, పద్మాజివాడి విండో వైస్ చైర్మన్ కుంట శ్రీనివాస్ రెడ్డి, వీఆర్ఏ శేఖర్ పాల్గొన్నారు.పిట్లం మండలంలోని తిమ్మానగర్ గ్రామంలో రైతులు వేస్తున్న వరినాట్లను ఏఈవో ప్రదీప్ పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలు అందజేశారు. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాట తీయాలని, పైరుకు గాలి, వెలుతురు తగిలి ఏపుగా పెరుగుతుందని సూచించారు.నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో మండల వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్ వరి పంటలను పరిశీలించారు. వరి పంటకు తాటాకు తెగులు సోకిందని గుర్తించినట్లు తెలిపారు. తెగులు నివారణకు ఫ్రొపెనోఫాస్ మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలని సూచించారు.
ఎరువుల వాడకంపై అవగాహన
నాగిరెడ్డిపేట్ మండలం ఆత్మకూర్ గ్రామంలోని రైతు వేదిక భవనంలో ఎరువుల వాడకంపై ఏవో విజయశేఖర్ రైతులకు అవగాహన కల్పించారు. పొలంలో జీలుగ వేసిన తర్వాత రసాయన ఎరువులు వాడవద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజ్మోహన్రెడ్డి, గ్రామ కన్వీనర్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఏఈవో దివ్య పాల్గొన్నారు.