ముందస్తుగా లాక్డౌన్ విధింపు
గ్రామంలో ఔషధ మొక్కల ద్రావణం స్ప్రే
తిప్పతీగ కషాయం తయారీ
సాతారం జీపీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు
మల్లాపూర్, మే 29: కరోనా కట్టడికి మండలంలోని సాతారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొంగొత్త ఆలోచనలు చేసి పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో కరోనా రెండో దశ ప్రారంభం నుంచి 40కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇందులో గ్రామానికి చెందిన ముగ్గురు కరోనాతో మృతి చెందడంతో ముందస్తుగా అప్రమత్తమయ్యారు. సర్పంచ్ బొడ్డు సుమలత ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, గ్రామస్తుల సమష్టి సహకారంతో కరోనా వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకర్లతో స్ప్రే చేశారు. తిప్పతీగ ఆకులు, పలు ఆయుర్వేద ఔషధాలను కలిపి తిప్పతీగ కషాయాన్ని తయారు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు పంపిణీ చేశారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది పర్యవేక్షించారు.
అందరి సహకారంతోనే సాధ్యం
గ్రామంలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వీడీసీ, గ్రామస్తుల సమష్టి సహకారంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు, పంచాయతీ పాలకవర్గ నిబంధనలను పాటించారు. కరోనాపై ప్రతి రోజు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం.