అవకాశముంటే హోం ఐసొలేషన్.. లేదంటే కొవిడ్ కేంద్రాలకు తరలింపు
నేటి నుంచి నగరంలో ఫీవర్ సర్వే .. పాల్గొననున్న450 బృందాలు
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. లక్షణాలు ఉండి కూడా టెస్టులు చేయించుకునేందుకు ముందుకురాని వారిని గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం నుంచి 450 బృందాలు ఫీవర్ సర్వే చేపట్టనున్నాయి. ఒక్కో బృందంలో వైద్య సిబ్బందితో పాటు ఆరుగురు సభ్యులుంటారు. ప్రతిరోజు ఏఎన్ఎం సారథ్యంలో నలుగురు ఆశ కార్యకర్తలు, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి గృహాన్ని సందర్శించనున్నారు. థర్మో స్కానర్లతో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి జ్వరంతో పాటు ఇతర కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే మందులు అందజేస్తారు. హోం ఐసొలేషన్లో ఉండేందుకు అవకాశం లేని వారిని కొవిడ్ కేంద్రాలకు తరలించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ సర్వే ఇప్పటికే పలు సర్కిళ్లలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టగా.. మంగళవారం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహిస్తారు.