ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఆమెలో కలిగింది. ఇంకేముంది.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలేసింది.. సివిల్స్ వైపు పరుగెత్తితింది. మొదటి ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. కానీ సమయ పాలన పాటిస్తూ.. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి.. సివిల్స్ ఫలితాల్లో రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. తనకు రెండో ర్యాంకు రావడానికి కేవలం టైం మేనేజ్మెంట్ మాత్రమే అని సెకండ్ ర్యాంకర్ జాగృతి అవస్థి మీడియాకు వెల్లడించింది.
కలెక్టర్ అవ్వాలని చిన్నప్పుడు కన్న కలలను.. కఠోరంగా శ్రమించి నిజం చేసుకున్నాను అని ఉప్పొంగిన సంతోషంతో ఆమె తెలిపింది. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో రోజుకు 8 గంటలు చదివేదాన్ని.. మెయిన్స్ కు రెండు నెలల ముందు 14 గంటల చదవడంతోనే.. ఆల్ ఇండియాలో రెండో ర్యాంకు సాధించగలిగానని జాగృతి సంతోషం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్కు చెందిన జాగృతి అవస్థి.. భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీటెక్ పట్టా పొందారు. ఆ తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( BHEL ) లో ఉద్యోగం వచ్చింది జాగృతికి. కానీ ఆ ఉద్యోగంతో ఆమె సంతృప్తి చెందలేదు. ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఆమెలో కలిగింది. అది పక్కన పెడితే కలెక్టర్ అవ్వాలన్నది ఆమె చిన్నప్పటి కల. దీంతో తాను చేస్తున్న ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన జాగృతి అవస్థి.. సివిల్స్ వైపు దృష్టి పెట్టింది. 2019లో తాను అనుకున్న లక్ష్యం సాధించలేకపోయింది. 2020లో కరోనా ఉధృతి కారణంగా కొంచెం సమయం ఎక్కువగా దొరకడంతో హార్డ్ వర్క్ చేయడంతో సివిల్స్లో విజయం సాధించగిలింది జాగృతి.
సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు చదివేది. ఆ సమయాన్ని కాస్త పెంచింది. తర్వాత 10 నుంచి 12 గంటల పాటు పుస్తకాలకే సమయం కేటాయించింది. మెయిన్స్ ఎగ్జామ్స్కు రెండు నెలల ముందు నుంచి రోజుకు 12 నుంచి 14 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టి.. ప్రతి అక్షరాన్ని ఒడిసిపట్టింది. అలా సమయాన్ని ఎక్కడా వృథా చేయకుండా.. నిరంతరం పుస్తకాలతో మమేకమైన జాగృతి.. రెండో ర్యాంకు సాధించి, ప్రశంసలు అందుకుంటోంది.