దుండిగల్, మే 6 : ముత్తూట్ ఫైనాన్స్లో గుర్తుతెలియని దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించగా.. లాకర్ తెరిచే క్రమంలో అలారం మోగడంతో అక్కడినుంచి పరారయ్యాడు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నగర శివారు గండిమైసమ్మ చౌరస్తాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ చౌరస్తాలో గత కొన్నేండ్లుగా ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ కొనసాగుతున్నది. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం సిబ్బంది విధులు ముగించుకుని ఇంటికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం సిబ్బంది పైనాన్స్ కార్యాలయానికి చేరుకోగా వెనుకవైపు గోడకు కన్నం వేసి ఉండటం గుర్తించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీ పుటేజీలను పరిశీలించగా బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వెనుకవైపు గోడకు కన్నం వేసిన ఓ దుండగుడు లోనికి ప్రవేశించినట్లు గుర్తించారు. సుమారు 10 నిమిషాల పాటు కార్యాలయం హాల్లోనే ఉన్న దుండగుడు లాకర్ను తెరిచేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో భయాందోళనకు గురైన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కార్యాలయంలోని నగదు, బంగారు ఆభరణాలు చోరీ కాలేదని సిబ్బంది పేర్కొన్నారు. ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మమ్మురం చేశారు. అయితే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.