న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూపీఎస్సీ మెయిన్ (UPSC main)-2021 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇవన్నింటినీ తోసిపుచ్చుతూ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని యూపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 7, 8, 9, 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం మొదటి సెషన్ పరీక్ష ప్రారంభమయింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షను మొత్తం 16 భాషల్లో నిర్వహిస్తున్నారు. అంటే తెలుగు, తమిళం, ఉర్దూతోపాటు అస్సామీ, మైథిలి, మలయాళం, బోడో, డోంగ్రీ, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలి, సింధి భాషల్లో రాయడానికి అవకాశం కల్పించారు. పరీక్షలను రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటలవ వరకు నిర్వహిస్తున్నారు.
జనవరి 7: ఫోర్నూన్ సెషన్లో పేపర్-1 ఎస్సే
జనవరి 8: ఫోర్నూన్ సెషన్లో పేపర్-2 జనరల్ స్టడీస్ 1, మధ్యాహ్నం సెషన్లో పేపర్-2 జనరల్ స్టడీస్ 2
జనవరి 9: ఫోర్నూన్ సెషన్లో పేపర్-3 జనరల్ స్టడీస్ 3, మధ్యాహ్నం సెషన్లో పేపర్-4 జనరల్ స్టడీస్ 4
జనవరి 15: ఫోర్నూన్ సెషన్లో పేపర్-A లాంగ్వేజ్ పేపర్, మధ్యాహ్నం సెషన్లో పేపర్-B ఇంగ్లిష్
జనవరి 16: ఫోర్నూన్ సెషన్లో పేపర్-6 ఆప్షనల్ పేపర్ 1, మధ్యాహ్నం సెషన్లో పేపర్-7 ఆప్షనల్ పేపర్ 2