హైదరాబాద్: ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ నేటినుంచి ప్రారంభం కానుంది. బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు నాలుగు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండురోజుల్లో మొత్తం నాలుగు సెషన్లలో ఈ పరీక్షలుం జరుగనున్నాయి.
కాగా, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి సూచించారు. ఆధార్, పాన్, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో ఒక కార్డును చూపించాలన్నారు. గంటన్నర ముందుగానే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. రాష్ట్రంలో 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 75,958 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.