తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 26న నిర్వహించనున్న టీఎస్ ఎడ్సెట్-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.సెషన్-I ఉదయం 9 -11.00 గంటల వరకు, సెషన్-II మధ్యాహ్నం 12.30- మధ్యాహ్నం 2.30 గంటలు, సెషన్-III సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు ఉంటుంది. సెషన్-Iకు 12,634 మంది, సెషన్-IIకు 12,732 మంది, సెషన్-IIIకి 12,725 మంది అభ్యర్థులు 39 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ కర్నూలు, విజయవాడలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోని వారు https://edcet.tsche.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలో కొవిడ్ ప్రొటోకాల్ను కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరని చెప్పారు.