హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గురువారం ప్రారంభం కానున్న ఎంసెట్ (EAMCET) అగ్రికల్చర్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి (TSCHE) ప్రకటించింది. అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.