Minister Sabita Indrareddy | కరోనా కారణంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే విద్యా బోధనలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె చెప్పారు. దీనికోసం ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణా తరగతులను మంత్రి కార్యాలయంలో ప్రారంభించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం టీచర్లు కూడా తమ వృత్తిపరమైన సామర్ధ్యాలను పెంచుకునేలా శిక్షనా తరగతులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలని ఆకాంక్షిస్తున్నారని, అందుకోసమే ఇంగ్లీషు మీడియం విద్యకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఈ క్రమంలో పిల్లలకు మెరుగైన బోధన అందించడం కోసం ఉపాధ్యాయులు కూడా తమ సామర్ధ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. దీనికోసమే దశలవారీగా ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని పెంచెందుకు ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు తమ బోధనలో ఉపయోగించుకొని, విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.