Inter Results | హైదరాబాద్, జూన్ 16 (నమస్తేతెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈసారి ఫస్టియర్ 67.4శాతం, సెకండియర్లో 50.82శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఫస్టియర్లో బాలికలు 73.88శాతం, బాలురు 61.75శాతం మంది పాసయ్యారు. ఇక సెకండియర్లో బాలికలు 54.47శాతం, బాలురు 48.54శాతం మంది పాసయ్యారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలను నిర్వహించగా, 4,13,880 మంది మంది పరీక్షలు రాశారు.
పెరిగిన ఉత్తీర్ణతాశాతం
ఈ సారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం పెరగడం గమనార్హం. ఈ సారి ఫస్టియర్లో 67.4శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 2024లో 63.86శాతం, 2023లో 62.58శాతం విద్యార్థులు పాసయ్యారు. సెకండియర్లో ఈ సారి 50.82 శాతం పాసైతే.. 2024లో 43.77 శాతం, 2023లో 46.06 శాతం పాసయ్యారు.
కోర్సుల వారీగా..
కోర్సుల వారిగా ఉత్తీర్ణత వివరాలను పరిశీలిస్తే ఎంపీసీలోనే అత్యధికులు పాసయ్యారు. ఎంపీసీ కోర్సులో ఫస్టియర్లో 78.26, సెకండియర్లో 59.06శాతం ఉత్తీర్ణులయ్యారు. బైపీపీ ఫస్టియర్లో 71.2శాతం, సెకండియర్ లో 54.5శాతం చొప్పున పాసయ్యారు. సీఈసీ ఫస్టియర్లో 37.72, సెకండియర్లో 38.02శాతం చొప్పున ఉత్తీర్ణత సాధించారు.