80 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు రంగం సిద్ధమవుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది అభ్యర్థులు వీటికి సమాయత్తం అవుతున్నారు. వీరందరిని దాటుకొని విజయం సాధించాలంటే కఠోర శ్రమ,
పక్కా ప్లానింగ్ అవసరం. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ కోచింగ్ సెంటర్కు వెళ్లాలి ? ఏ పుస్తకాలు కొనాలి అనే వాటి గురించి ఆలోచించి అనవసరంగా సమయం వృథా చేసుకోకండి. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే విజయం సాధ్యమవుతుంది. సర్కారీ కొలువులే లక్ష్యంగా సాగే అభ్యర్థుల కోసం నిపుణులు ఇచ్చిన సలహాలు మీ కోసం..
అభ్యర్థులు ఏ పరీక్షకు ప్రిపేరవుతున్నారో మొదట ఆ పరీక్ష విధానం, దానికి సంబంధించిన సిలబస్ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఒకటికి నాలుగుసార్లు ఆ టాపిక్స్ను చదవాలి. డిగ్రీలో చదివిన సబ్జెక్టులు కాకుంటే వాటికి సంబంధించి సీనియర్ ఉపాధ్యాయులు లేదా గతంలో ఆయా పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారిని కలసి వాటికి సంబంధించి పూర్తి అంశాలను తెలుసుకోవాలి. సిలబస్లో ఏ అంశాలు తమకు అనుకూలంగా ఉన్నాయి. ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి? వంటి విషయాలను అర్థం చేసుకోవాలి. దీనికోసం ప్రీవియస్ పేపర్లను పరిశీలించాలి. దీనివల్ల ఏ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి? పరీక్షలో అభ్యర్థుల నుంచి పరీక్ష పెట్టే బోర్డు/సంస్థ ఏం ఆశిస్తుందో నిర్ధారణకు రావాలి. ఇక్కడే అభ్యర్థి విజయం ఆధారపడి ఉంటుంది.
నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఆలస్యమవుతుందా? ఇప్పుడేం తొందర అనే భావన వీడండి. వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి. సిలబస్కు అనుగుణంగా బుక్స్ను తెచ్చుకుని ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. దానికి అనుగుణంగా సమయం వృథా చేయకుండా హార్డ్వర్క్ చేయండి. గంటల తరబడి చదవడం హార్డ్ వర్క్ కాదు. రోజు నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని దానికి అనుగుణంగా సిలబస్ను పూర్తిచేసుకోవాలి. చదివిన అంశాలపై పట్టు వచ్చిందా రాలేదా అని నిర్ధారణ కోసం ఆయా చాప్టర్ల నుంచి ప్రాక్టీస్ బిట్స్ చేసి మీ స్థాయిని నిరంతరం అంచనా వేసుకోవాలి.
ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలి అనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ప్రతి అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. కానీ అన్నింటికి సిద్ధం కావడం సాధ్యం కాదు. కానీ అదే సందర్భంలో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్తో దాదాపు ఒకే మాదిరిగా ఉండే పరీక్షలకు సిద్ధం కావచ్చు. ఉదాహరణకు గ్రూప్-2, 3లకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు. అంతేకాకుండా వీటికి ప్రిపేరయినవారు గ్రూప్-4ను కూడా సులభంగా సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉన్నవారు, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కువ పోస్టులు ఉన్నవాటికి రెడీ అయితే మంచిది.
ఏ పరీక్ష తీసుకున్నా దానిలో జీఎస్ పాత్ర చాలా కీలకం. అంతేకాకుండా దీనిలో పట్టు సాధిస్తే చాలా అంశాలపై ప్రాథమిక అవగాహన కూడా వస్తుంది. జీఎస్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్ ఇలా అనేక అంశాలు ఉంటాయి. దీనికోసం మొదట అభ్యర్థులు మూడో తరగతి నుంచి పదోతరగతి, కొన్నింటికి 10+2 స్థాయి వరకు బుక్స్ను చదివి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో మ్యాథ్స్ ప్రాథమిక అంశాలను ప్రిపేర్ కావడం వల్ల మెంటల్ ఎబిలిటీపై పట్టు వస్తుంది.