హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాలపై టీ శాట్ చానెల్లో రేపు ఉదయం 11 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల సందేహాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు నివృత్తి చేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 040-23540326, 23540726, టోల్ ఫ్రీ నెంబర్1800 425 4039 కు కాల్ చేయాలని శైలేష్ రెడ్డి సూచించారు.
పోలీసు ఉద్యోగార్థుల కోసం టీ శాట్ నిపుణ చానెల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, విద్య చానెల్లో రాత్రి 8 నుండి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు ప్రసారం అవుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక తరగతులు 5వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు.. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష పూర్తయ్యే వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు మెంటల్ హెల్త్లో భాగంగా మనోమిత్ర కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుండి నిపుణ చానెల్లో సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రసారం చేస్తున్నట్లు శైలేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం 12 నుండి ఒంటి గంట వరకు పున: ప్రసారం అవుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు వివిధ స్థాయిల్లో టీ శాట్ నెట్వర్క్ అందించే ప్రసారాల సేవలను సద్వినియోగం చేసుకొని, విజయాలు సాధించాలని సీఈవో శైలేష్ రెడ్డి సూచించారు.