దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు 2023 నుంచి ఏడాదికి రెండుసార్లు సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించేందుకు యూజీసీ ఆలోచిస్తోంది. ఈ సీయూఈటీని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా జేఈఈ మెయిన్స్లాగా ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ తెలిపారు. విద్యార్థులు స్కోర్ పెంచుకునేందుకు వీలుంటుందని, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పారు.
ఈ ఏడాది (2022)లో ఒకసారి మాత్రమే సీయూఈటీ ఉంటుందని జగదీశ్కుమార్ స్పష్టం చేశారు. జూలై నెలలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రెండుసార్లు సీయూఈటీ నిర్వహించాలనే విషయంపై ప్రస్తుతానికైతే ఇంకా స్పష్టత లేదన్నారు.
ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్యాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది. ఇందులో విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇకపై బోర్డు ఎగ్జామ్ ఫలితాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఏప్రిల్ 2, 2022న యూజీసీ విడుదల చేయనుంది.