న్యూఢిల్లీ: రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిలిచిపోయిన NEET-PG కౌన్సెలింగ్ను తిరిగి కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి NEET-PG కౌన్సెలింగ్ను మొదలు పెట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఇటీవల NEET-PG కౌన్సెలింగ్ వాయిదాపడింది.
అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్, ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్ పద్ధతిలోనే కౌన్సెలింగ్ను కొనసాగించాలని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 నుంచి NEET-PG కౌన్సెలింగ్ను కొనసాగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది.