న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక సూత్రధారిగా ఉన్నారనే ఆరోపణలపై పుణెకు చెందిన ఒక కెమిస్ట్రీ లెక్చరర్ని సీబీఐ అరెస్టు చేసింది. ఒక రహస్య ట్యూషన్ సెషన్లో ఆ లెక్చరర్ పలువురు అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు సీబీఐ పేర్కొన్నది. పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తరఫున నిందితుడు పీవీ కులకర్ణికి పరీక్ష ప్రక్రియతో సంబంధం ఉందని సీబీఐ తెలిపింది.
రిటైర్డ్ కాలేజీ ప్రొఫెసర్ అయిన కులకర్ణిని ప్రశ్నించేందుకు సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ చివరి వారంలో పుణెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన రహస్య కోచింగ్ సెషన్లో కులకర్ణి, ఈ కేసులోని మరో నిందితుడి సహాయంతో నీట్-యూజీ అభ్యర్థుల బృందానికి ప్రశ్నపత్రాలను, సరైన సమాధానాలను లీక్ చేసినట్లు సీబీఐ పేర్కొన్నది. కులకర్ణికి సహకరించిన మనీషా మాఘ్మారేను సీబీఐ అరెస్టు చేసింది.