న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నిరుద్యోగులకు శుభవార్త. కొత్త ఏడాదిలో కొలువుల జాతర మొదలు కానున్నది. జనవరి-మార్చిలో కార్పొరేట్ సంస్థలు భారీగా నియామకాలకు దిగనున్నాయి. మ్యాన్పవర్గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ తాజా సర్వే వివరాల ప్రకారం దేశంలో హైరింగ్ సెంటిమెంట్ గడిచిన ఎనిమిదేండ్లలోనే ఎన్నడూ లేనంత బలంగా ఉందని తేలింది. 49 శాతం కంపెనీలు మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సై అంటున్నాయి. ఏడాది క్రిందటితో పోల్చితే ఇది 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కరోనాతో అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇక నిలకడగా కోలుకుంటుందన్న ఆశాభావం కార్పొరేట్ వర్గాల్లో పెరిగినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.
64 శాతం సంస్థల్లో అవకాశాలు
సర్వేలో మొత్తం 3,020 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో 64 శాతం సంస్థలు తమ సిబ్బందిని రాబోయే మూడు నెలల్లో పెంచుకుంటామని చెప్పాయి. అయితే 15 శాతం కంపెనీలు.. ఉద్యోగులు తగ్గుతారని చెప్పగా, మరో 20 శాతం సంస్థలు తమ ఉద్యోగులు యథాతథంగానే ఉంటారన్నాయి. దీంతో నికర ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ 49 శాతంగా తేలింది. ‘మార్కెట్లో వినియోగ సామర్థ్యం మళ్లీ పెరిగింది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తగ్గుతుందనడానికి సంకేతాలు. ప్రస్తుతం దేశ జీడీపీ ‘వీ’ ఆకృతిలో పుంజుకుంటున్నది. ఈ క్రమంలోనే సంస్థలు నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. ప్రభుత్వాల చర్యలు ఫలించి వ్యాక్సినేషన్ సైతం వేగంగా సాగుతున్నది’ అని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ అన్నారు.
బడా సంస్థల్లోనే..
వచ్చే ఏడాది జనవరి-మార్చిలో ఉద్యోగ నియామకాలు చేపడుతామని 51 శాతం భారీ సంస్థలు చెప్తున్నాయి. చిన్నతరహా సంస్థల్లో ఇది 25 శాతంగానే ఉన్నది. ఇక దక్షిణాది, పశ్చిమాది రాష్ర్టాల్లోని సంస్థల కంటే ఉత్తరాది కంపెనీలే నియామకాలకు ఎక్కువగా ముందుకు రానున్నాయి. కాగా, ఉద్యోగులకు రెండు డోసుల వ్యాక్సినేషన్కు తప్పనిసరి అని, అందుకు సంబంధించిన ధ్రువపత్రం కూడా ఉండాల్సిందేనని 91 శాతం సంస్థలు ఈ సందర్భంగా తేల్చిచెప్పాయి. కరోనా నేపథ్యంలో చాలామంది రాజీనామాలు చేయడంతో మెజారిటీ రంగాల్లో, ముఖ్యంగా ఐటీ సంస్థల్లో నైపుణ్యం, ప్రతిభ కొరత స్పష్టంగా కనిపిస్తున్నదని, దీంతో కొత్తవారికి అవకాశాలు పెద్ద ఎత్తున ఇవ్వాలనే సంస్థలు చూస్తున్నాయని సందీప్ తెలిపారు.
ఐటీదే హవా
రాబోయే నియామకాల్లో ఐటీ, టెక్నాలజీ సంస్థల వాటానే భారీగా ఉండనున్నది. టెలికం, కమ్యూనికేషన్స్, మీడియా సంస్థల్లోనూ ఆకర్షణీయంగానే నియామకాలు జరగనున్నాయి. ఈ రంగాలన్నీ 60 శాతంతో ముందుండగా, 56 శాతంతో రెస్టారెంట్లు, హోటళ్లు రెండో స్థానంలో ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, నిర్మాణ రంగాల్లో 52 శాతం డిమాండ్ ఉన్నది. హైబ్రీడ్ వర్క్నూ కార్పొరేట్లు స్వాగతిస్తున్నారు.