హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్తో నిత్యం లక్షల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం రైల్వేపై పడుతోంది. ఫలితంగా సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రైల్వేశాఖ రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు నడిచే 25 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రేణిగుంట, సికింద్రాబాద్, రేపల్లె, ఇతర స్టేషన్ల నుంచి వచ్చే రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి మే 31వ తేదీ వరకు, మరికొన్ని జూన్ 2వ తేదీ వరకు రద్దయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
అలాగే ఈ నెల 2న బయలుదేరాల్సిన నాందెడ్-తాండూరు రైలును సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తున్నారు. 3న బయలుదేరాల్సిన తాండూరు-పర్బని ట్రెయిన్ను కూడా పాక్షికంగా రద్దు చేశారు.