న్యూఢిల్లీ: ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను (JEE Advanced Result) ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫైనల్ కీతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను Jeeadv.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన వేద్ లహోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడు 360 మార్కులకు గాను 355 మార్కులు స్కోర్ చేశాడు. ఆదిత్య (346), భోగల్పల్లి సందేశ్ (338), రిథమ్ కేడియా (337), పుట్టి కుషాల్ కుమార్ (334) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అమ్మాయిల్లో ఐఐటీ బాంబే జోన్కు చెందిన ద్విజా ధర్మేశ్కుమార్ 355 మార్కులతో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నది.
మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుంచి 24వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. జోసా కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 15న మాక్ సీట్ల కేటాయింపు -1, 17న మాక్ సీట్ల కేటాయింపు -2 ఉంటుంది. 18వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. 19న వెరిఫికేషన్ను చేపడతారు.