హైదరాబాద్: అమెరికా టెక్ కంపెనీ UST తన వర్క్ఫోర్స్ను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం బెంగళూరు బ్రాంచిలో మొత్తం 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఆ సంఖ్యను 12,000 పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోజురోజుకు వ్యాపారం విస్తరిస్తుండటంతో తాము మ్యాన్పవర్ పెంచుకోవాలని నిర్ణయించామని UST ప్రకటించింది.
బెంగళూరు కేంద్రంలో హెల్త్కేర్, టెక్నాలజీ, లాజిస్టిక్స్, సెమీకండక్టర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల్లో క్లయింట్స్కు ఉత్పత్తులను, సేవలను అందించడం కోసం ఫ్రెష్ర్స్తోపాటు అనుభవజ్ఞులైన ఇంజినీర్స్ను నియమించుకోనున్నట్లు UST వెల్లడించింది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలోనూ ఇటీవలే 1,000 మంది ఉద్యోగులను నియమించగా.. రాగల రెండేండ్లలో ఆ సంఖ్యను 2,000 లకు పెంచనున్నట్లు పేర్కొన్నది.
అమెరికాకు చెందిన UST కంపెనీకి కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఆ కంపెనీకి మొత్తం 35 కార్యాలయాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, పుణె, కోయింబత్తూరు, హోసూర్, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో UST కంపెనీకి డెడికేటెడ్ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్లు ఉన్నాయి.