న్యూఢిల్లీ: భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (ఐసీఎమ్మార్ జేఆర్ఎఫ్) టెస్టు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు, యూనివర్సిటీలు, నేషనల్ ల్యాబొరేటరీలు లేదా సంస్థల్లో ఉన్నత విద్య, పరిశోధనలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్లు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి. ఐసీఎమ్మార్ తరఫుణ ఈ పరీక్షను పీజీఐఎంఈఆర్ నిర్వహిస్తున్నది. ప్రతి ఏడాది ఈ పరీక్షను జూలై నిర్వహిస్తారు. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఈ ఏడాది కొద్దిగా ఆలస్యమయ్యింది.
ఐసీఎమ్మార్ మొత్తం 150 ఫెలోఫిప్లను అందిస్తున్నది. ఇందులో 120 లైఫ్ సైన్సెస్కు చెందినవికాగా, మిగిలిన 30 సోషల్ సైన్సెస్కు సంబంధించినవి ఉన్నాయి.
లైఫ్సైన్సెస్లో.. మైక్రోబయాలజీ, సైకాలజీ, మాలిక్యులార్ బయాలజీ, జెనెటిక్స్, హ్యూమన్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోఫిజిక్స్, ఇమ్యునాలజీ, ఫార్మకాలజీ, నర్సింగ్, జూలజీ, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, వెటర్నరీ మెడిసిన్ వంటి అంశాలు ఉన్నాయి.
సోషల్ సైన్సెస్లో.. సైకాలజీ, సోషియాలజీ, హోమ్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఆంత్రపాలజీ, సోషల్ వర్క్, పబ్లిక్ హెల్త్, హెల్త్ ఎకనామిక్స్ వంటి అంశాలు ఉన్నాయి.
అర్హతలు: ఎమ్మెస్సీ, ఎంఏ లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుల ప్రారంభం: జూలై 1
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
సీబీటీ టెస్ట్: సెప్టెంబర్ 12
వెబ్సైట్: pgimer.edu