నూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్డీ ప్రవేశాలు పొందేందుకు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల్లో ఉద్యోగాల్లో చేరేందుకు నిర్వంహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2023 వచ్చే ఫిబ్రవరిలో జరగనుంది. ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమవుతుంది. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
గేట్ ద్వారా ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, రూర్కీ, బెంగళూరులోని ఐఐఎస్సీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఏటా ఒక్కో సంస్థ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఈసారి ఐఐటీ కాన్పూర్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నది.
బీటెక్తో పాటు బీఎస్సీ, బీకాం, బీఏ విద్యార్థులూ ఈ పరీక్ష రాయవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. మొత్తం 29 సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి. పరీక్షకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ త్వరలో వెబ్సైట్ను ప్రారంభించనుంది. గేట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలిస్తాయి.