హైదరాబాద్: ప్రోడక్ట్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన eInfochips హైదరాబాద్లోని తన డిజైన్ సెంటర్ను విస్తరించింది. పెరుగుతున్న కస్టమర్ డిమాండ్ మేరకు హైదరాబాద్ డిజైన్ సెంటర్ను విస్తరించినట్లు సంస్థ తెలిపింది. ఇక 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ డిజైన్ సెంటర్లో 350 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని eInfochips సంస్థ భావిస్తున్నది.
అయితే, రాబోయే ఆరు నెలల్లో దాదాపు 100 మంది ఇంజినీర్లను నియమించుకోనుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ చివరి నాటికి దాదాపు మరో 250 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నది. సిలికాన్ డిజైన్, వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్పై ప్రధానంగా దృష్టి సారిస్తూ నియామకాలు చేపట్టనుంది. eInfochips అనేది యారో ఎలక్ట్రానిక్స్ అనుబంధ సంస్థ. ఇది ఫార్చ్యూన్ 102 కంపెనీ. యారో గొడుగు కింద, కంపెనీ ప్రధాన సెమీకండక్టర్, హైపర్-స్కేల్, సిస్టమ్ కంపెనీలతో నిమగ్నమై ఉన్నది.